ఏపీ కోటాలో త్వరలో ఖాళీ కానున్న 4 రాజ్యసభ స్థానాల ఎన్నికలు శుక్రవారం పూర్తయ్యాయి. 4 స్థానాలకు కేవలం 4 నామినేషన్లే రాగా.. నామినేషన్లు వేసిన నలుగురు వైసీపీ అభ్యర్థులు వేణుంబాక విజయసాయిరెడ్డి, ఆర్.కృష్ణయ్య, బీద మస్తాన్ రావు, నిరంజన్ రెడ్డిలు ఏకగ్రీవంగానే ఎన్నికైనట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ మేరకు రిటర్నింగ్ అధికారి నుంచి నలుగురు అభ్యర్థులు తాము రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు డిక్లరేషన్లను అందుకున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగిసింది. నామినేషన్ల ఉప సంహరణ గడువు ముగిసేసరికి ఎంతమంది బరిలో ఉంటారన్న దానిపై ఈసీ ఓ ప్రకటన చేస్తుంది. ఆ దిశగానే రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగిసిన తర్వాత ఏపీ కోటాలోని 4 స్థానాలకు 4 నామినేషన్లు మాత్రమే బరిలో ఉన్నట్లు తేలింది. దీంతో ఆ నలుగురు ఏకగ్రీవంగా రాజ్యసభకు ఎన్నికైనట్లు ఈసీ ప్రకటించింది.