రాష్ట్రపతి ఎన్నికల్లో తమ పార్టీ మద్దతు ఎవరికి ఇవ్వాలన్న విషయంపై తాము ఇంకా నిర్ణయం తీసుకోలేదని.. ఈ విషయంలో పార్టీ అధినేత వైఎస్ జగనే నిర్ణయం తీసుకుంటారని వైసీపీ నేత విజయ సాయి రెడ్డి తెలిపారు. అయినా అణగారిన వర్గాలకు అత్యున్నత పదవులు ఇస్తామంటే ఎవరు కాదంటారని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను బట్టి చూస్తుంటే బీజేపీ అభ్యర్థికే వైసీపీ సపోర్ట్ అని అర్థమవుతోంది.
రాష్ట్రపతి ఎన్నికల రేసులో అధికార పక్షం ఎన్డీఏ అభ్యర్థిగా ఖరారైన ద్రౌపది ముర్ము గురువారం ఢిల్లీ చేరుకున్నారు. రేపు ఆమె తన నామినేషన్ను దాఖలు చేయనున్నారు. ఆమె ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పాటు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాలతో భేటీ అయ్యారు. రాష్ట్రపతి అభ్యర్థిగా తనను ఎంపిక చేసినందుకు ఆమె వారికి కృతజ్ఞతలు తెలిపారు. ముర్ము గొప్పతనాన్ని ప్రస్తావిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్డీఏ అభ్యర్థిగా ముర్మును ఎంపిక చేయడంపై దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయని.. సమాజంలోని అన్ని వర్గాలు ఆమె అభ్యర్థిత్వాన్ని స్వాగతించాయని తెలిపారు. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ముర్ము శుక్రవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. ముర్ము నామినేషన్ పత్రాలపై ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా సంతకాలు చేయనున్నారు. ముర్ము అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించేందుకు ఢిల్లీ రావాలంటూ ఎన్డీఏ తరఫున సీఎంలుగా కొనసాగుతున్న నేతలకు బీజేపీ ఆహ్వానం పలికింది.