ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటనకు వచ్చిన సమయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ బెంగళూరు పర్యటనకు వెళ్లారు. పలువురు నేతలు కేసీఆర్ తీరును తప్పుబట్టారు. బీజేపీ నేతలయితే కేసీఆర్ కు ప్రధాని మోదీ ముందు మొహం చెల్లకే వెళ్ళిపోతూ ఉన్నారని విమర్శలు గుప్పించారు.
తాజాగా వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సీఎం కేసీఆర్ తీరును తప్పుబట్టారు. “ఢిల్లీ కోటలు బద్దలు కొడతాం, కడిగిపారేస్తాం, ఏకిపారేస్తాం అన్న కేసీఆర్ సారూ… మోదీ ఇక్కడకు వస్తే మీరెక్కడికి పారిపోయారు?” అంటూ షర్మిల ప్రశ్నించారు. “మా తెలంగాణ ధాన్యం ఎందుకు కొనవు? మద్దతు ధర ఎందుకు ఇవ్వవు అని ఏకిపారేయలేకపోయావా?”.. “పిల్లిని చూసి ఎలుక దాక్కున్నట్టు మోదీ గారొస్తే పిరికివాడి లాగా పారిపోయావా?” అంటూ విమర్శించారు. “కేసీఆర్ పాలన అవినీతిమయం అని మోదీ చెబుతారు. మోదీ అవినీతి చిట్టా తన దగ్గర ఉందని కేసీఆర్ చెబుతారు. కానీ, ఇద్దరూ ఎదురుపడరు, అవినీతిని బయటపెట్టరు. జనాన్ని మాత్రం పిచ్చోళ్లను చేస్తారు. మీవన్నీ ఉడుత ఊపుల ప్రసంగాలేనా? లేక, ఒకరి అవినీతిని ఒకరు బయటపెట్టకూడదని చీకటి ఒప్పందాలేమైనా చేసుకున్నారా?” అంటూ షర్మిల ప్రశ్నించారు.