నకిలీ చలానాల కుంభకోణం ఏపీలో కలకలం రేపుతుండగా.. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు దర్యాప్తు చేపట్టారు. గుంటూరు, కర్నూలు, కడప జిల్లాల్లోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఆడిట్ బృందాలు తనిఖీలు నిర్వహించాయి. కర్నూలు జిల్లా నంద్యాలలో సబ్ రిజిస్ట్రార్ తో పాటు జూనియర్ అసిస్టెంట్ పై అధికారులు వేటు వేశారు. కడపలో ముగ్గురు సబ్ రిజిస్ట్రార్లు, ఇద్దరు జూనియర్ అసిస్టెంట్లపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ అంశంపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆరా తీశారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులతో చర్చించారు. సొమ్ము రికవరీపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.ఇప్పటికే రూ. 40 లక్షలు రికవరీ చేసినట్టు సీఎంకు అధికారులు వివరించారు. రిజిస్ట్రేషన్ సాఫ్ట్ వేర్ లో మార్పులు చేసి అక్రమాలకు పాల్పడ్డారని చెప్పారు. ఈ కుంభకోణంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టాలని జగన్ ఆదేశాలు జారీ చేశారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులతో జగన్ ఫోన్ లో మాట్లాడారు. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రిజిస్ట్రేషన్ల సాఫ్ట్వేర్ లో మార్పులు చేసినట్లు వెల్లడించారు. రిజిస్ట్రేషన్ల సాఫ్ట్వేర్ను ఎన్ఐసీ, సీఎఫ్ఎంఎస్లకు అనుసంధానం చేయడం ద్వారా అవకతవకలకు చెక్ చెప్పొచ్చని సీఎంకు వివరించారు అధికారులు.
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో చోటు చేసుకున్న ఈ అవినీతి అక్రమాలపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 35 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై ఉన్నతాధికారులు దాడులు నిర్వహించినట్లు రిజిస్ట్రేషన్ల శాఖ డీఐజీ శ్రీనివాసరావు తెలిపారు. సీఎఫ్ఎంఎస్లోని లోపాలే ఆసరాగా కోట్లు కొల్లగొట్టినట్లు గుర్తించారు. సీఎప్ఎంఎస్, ఈ-చలానా, ఈసీ, ఆర్హెచ్, నకళ్లను సీనియర్ అసిస్టెంట్లు చేయాల్సి ఉండగా.. ఈ పనులను ప్రైవేటు రైటర్స్తో చేయిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టారు.