గురువారం ఆఫ్ఘనిస్తాన్లోని హెరాత్ ప్రావిన్స్లో తాలిబాన్లు యువ వైద్యుడిని హతమార్చారు. అమ్రుద్దీన్ నూరి అనే 33 ఏళ్ల వైద్యుడు హెరాత్లోని పోలీసు చెక్పాయింట్ వద్ద ఆగకుండా వెళ్లిపోవడంతో తాలిబాన్ వ్యక్తులు కాల్చి చంపారని బాధితుడి కుటుంబ సభ్యులు తెలిపారు. అమ్రుద్దీన్ నూరీని తాలిబన్లు కాల్చి చంపారనే వాదనలను హెరాత్లోని భద్రతా సిబ్బంది తోసిపుచ్చారు. ఇలాంటి ఘటన జరిగినట్లు తమకు ఎలాంటి సమాచారం లేదని చెప్పారు. అమ్రుద్దీన్ నూరి ఒక చిన్న క్లినిక్లో పనిచేస్తూ ఇటీవలే వివాహం చేసుకున్నాడు.
ఇక ఉత్తర ఆఫ్ఘనిస్తాన్లో కిడ్నాపర్లు ఆరోపించిన మహ్మద్ నాదర్ అలెమీ అనే సైకియాట్రిస్ట్ దారుణంగా చంపబడ్డాడు. నాదర్ అలెమీ కుమారుడు రోహీన్ అలెమీ మాట్లాడుతూ “నా తండ్రిని తీవ్రంగా హింసించారు, అతని శరీరంపై ఎన్నో గాయాలు ఉన్నాయి.” అని తెలిపాడు. నాదర్ అలెమీ హత్యకు పాల్పడిన నేరస్థులను కనుగొని శిక్షించే దిశగా చర్యలు చేపట్టామని తాలిబాన్ అధికార ప్రతినిధి తెలిపారు. ఇస్లామిక్ ఎమిరేట్ నేరస్తులను కనుగొని శిక్షించడానికి కట్టుబడి ఉందని తాలిబాన్ అధికారులు తెలిపారు. సయీద్ ఖోస్తీ మాట్లాడుతూ ఎనిమిది మంది కిడ్నాపర్లను పట్టుకున్నామని.. మరో ఇద్దరు బాధితులను విడిపించామని తెలిపారు. తాలిబాన్ పాలనలో ఆఫ్ఘనిస్తాన్లో బాంబు పేలుళ్ల నుండి ప్రముఖ వ్యక్తుల కిడ్నాప్ వరకు నేరాలు గణనీయంగా పెరిగాయి. ఇస్లామిస్టులు దేశంలోని మతపరమైన మైనారిటీలను కూడా లక్ష్యంగా చేసుకున్నారు. షరియా చట్టం ప్రకారం మహిళలపై ఆంక్షలు కూడా విధించారు.
ఇక అక్కడ శాంతిభద్రతలు రోజురోజుకు దిగజారుతుండడంతో ప్రజల మానప్రాణాలకు రక్షణ లేకుండా పోతోంది. వ్యాపారులపై దాడులు పెరుగుతున్న నేపథ్యంలో తాలిబాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాపారులు తమ రక్షణ కోసం ఆయుధాలను వెంట తీసుకెళ్లొచ్చని ప్రకటించింది. ఈ మేరకు ఆ దేశ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఆయా సాంకేతిక సమస్యల పరిష్కారం అనంతరం ఈ నిర్ణయం అమలు చేయనున్నట్టు తెలిపింది.