ఉగ్రవాద దేశం పాకిస్తాన్లో పాపాలకు కొదవలేదు. అక్కడ అమ్మాయిలు, మహిళలపై అత్యాచారాలు నిత్య కృత్యంలా మారాయి. తాజాగా పాకిస్తాన్లో ఆడవాళ్లకు అసలు రక్షణే లేకుండా పోయింది. అమ్మాయిలు బయటకు వెళ్లాలంటే సెక్యూరిటీని తీసుకెళ్లాల్సిన పరిస్తితి ఏర్పడింది. ప్రతి రోజు పదుల సంఖ్యలో మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు జరుగుతుండటం అక్కడి ప్రభుత్వాన్ని ఆందోళనకు గురి చేస్తోంది.
పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్లో అత్యవసర పరిస్థితిని విధించారు. మహిళలు, చిన్నారులపై లైంగిక వేధింపు కేసులు ఘణనీయంగా పెరుగున్న నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు పంజాబ్ హోం శాఖ మంత్రి అట్టా తరార్ మీడియాకు తెలిపారు. రోజుకు 4 నుంచి 5 అత్యాచార కేసులు నమోదవుతున్నాయి. లైంగిక వేధింపులు పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలకు పూనుకుంటోంది. అత్యాచార కేసులను అరికట్టేందుకు ప్రభుత్వం అత్యవసర పరిస్థితిని విధించిందని, ప్రభుత్వం ఈ విధమైన కేసులను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు మంత్రి తెలిపారు.
ఈ విషయంలో సివిల్ సొసైటీ, ఉమెన్ రైట్స్ ఆర్గనైజేషన్లు, ఉపాధ్యాయులు, న్యాయవాదులు ప్రభుత్వంతో చర్చించేందుకు ముందుకురావాలని మంత్రి కోరారు. దీనిలో భాగంగా తల్లిదండ్రులు తమ పిల్లలను కాపాడుకోవడంలో దృష్టి నిలపాలని సూచించారు. ప్రభుత్వం కూడా యాంటీ-రేప్ క్యాంపెయిన్ను ప్రారంభించిందని, దీనిపై విస్తృత ప్రచారం చేపడుతున్నట్లు మంత్రి వెల్లడించారు. నేరాలకు పాల్పడిన వారిలో అనేక మందిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. రెండు వారాల్లో ఒక సిస్టంను అమల్లోకి తీసుకువస్తామని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ 2021 ర్యాంకింగ్స్ ప్రకారం.. ప్రపంచంలోని మొత్తం156 దేశాలలో లింగ అసమానతల్లో పాకిస్తాన్ 153వ స్థానంలో ఉంది. ఇరాక్, యెమెన్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉన్నట్లు తెల్పింది.