రాజస్థాన్లోని ఉదయ్పూర్లో టైలల్ కన్హయ్య లాల్ను మంగళవారం నరికి చంపిన ఇద్దరు హంతకులను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. కన్హయ్య హత్య అనంతరం బైక్పై నగరం నుంచి పారిపోతున్న గౌస్ మహ్మద్, రియాజ్ అక్తరీని ఉదయ్పూర్ శివారులోని హైవేపై పోలీసులు అడ్డుకున్నారు.
రహదారిపై బారికేడ్లను ఏర్పాటు చేసిన పోలీసులు ఇద్దరు హంతకులను చుట్టుముట్టి వారిని నిరాయుధులను చేశారు. ఆపై అదుపులోకి తీసుకుని పోలీస్ వాహనంలో స్టేషన్కు తరలించి అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ నితిన్ అగర్వాల్ ఈ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ‘ఉదయపూర్ టైలర్ను ఊచకోత కోసిన హంతకులిద్దరినీ రాజస్థాన్ పోలీసులు పట్టుకున్నారు. రాజస్థాన్ పోలీసులు సంఘటనా స్థలంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. చేయాల్సింది ఇంకా ఉంది. ఇది కాంగ్రెస్ పాలిత రాజస్థాన్. సంఘ వ్యతిరేకులను అస్సలు సహించదు’ అని అందులో పేర్కొన్నారు.
కాగా, బీజేపీ నుంచి సస్పెండైన నుపుర్ శర్మ ఒక టీవీ ఇంటర్వ్యూలో మహ్మద్ ప్రవక్తపై వివాదస్పద వ్యాఖ్యలు చేయడంతో దేశ వ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి. ఉదయ్పూర్కు చెందిన హిందువైన టైలర్ కన్హయ్య లాల్, ప్రవక్తపై నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఆయనపై కొందరు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అనంతరం పోలీసులు ఇరు వర్గాలతో మాట్లాడి సమస్యను పరిష్కరించారు. ఆ తర్వాత ఆయనకు బెదిరింపులు వచ్చాయని మృతుడు కన్హయ్య భార్య తెలిపింది.
ప్రవక్తను అవమానించినందుకు ప్రతీకారంగా కన్హయ్యను నరికి చంపినట్లు హంతకులు వీడియోలో పేర్కొన్నారు. ప్రధాని మోదీని కూడా బెదిరించారు. దీంతో ఉగ్రవాద దాడిగా పరిగణించిన కేంద్రం ఈ కేసు దర్యాప్తును జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగించింది. ఇద్దరు హంతకులకు పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉండవచ్చని అనుమానిస్తున్నది. మరోవైపు మృతుడు కన్హయ్య కుటుంబానికి రూ.31 లక్షల పరిహారంతోపాటు ఇద్దరు కుమారులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని రాజస్థాన్ ప్రభుత్వం ప్రకటించింది. ఉదయ్పూర్లో పరిస్థితి అదుపులో ఉన్నట్లు వెల్లడించింది.