పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో బీజేపీ కార్యకర్తలపై దాడులు ఇంకా ఆగడం లేదు. బీజేపీ కార్యకర్త భార్యపై సామూహిక అత్యాచారం చోటు చేసుకుంది. తృణమూల్ కాంగ్రెస్ గూండాలు ఈ దారుణానికి పాల్పడ్డారని బాధిత కుటుంబం ఆరోపిస్తూ ఉంది. శనివారం నాడు (ఆగస్టు 7)న బీజేపీ కార్యకర్త భార్యపై రాత్రి 12 గంటల సమయంలో 5 మంది గూండాలు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. పశ్చిమ బెంగాల్లోని హౌరా జిల్లాలోని బగ్నాన్ విధానసభ నియోజకవర్గంలోని అమ్టాలో ఈ ఘటన చోటు చేసుకుంది.
న్యూస్ 18 బంగ్లా కథనం ప్రకారం.. ఆ రోజు రాత్రి బీజేపీ కార్యకర్త ఇంట్లో లేరని.. విషయాన్ని తెలుసుకున్న నిందితులు ఇంట్లోకి చొరబడి అతని భార్యపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలికి కొద్ది రోజుల క్రితం సెరిబ్రల్ స్ట్రోక్ వచ్చింది. ఆమె మాట్లాడే సామర్థ్యం కోల్పోయింది. బాధితురాలి అరుపులు విన్న ఇరుగుపొరుగు వారు అప్రమత్తమై ఆమెను ఉలుబేరియా సబ్ డివిజన్ ఆసుపత్రికి తరలించారు.
తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీ సభ్యులే ఈ అత్యాచారానికి పాల్పడ్డారని బీజేపీ ఆరోపించింది. సామూహిక అత్యాచారం కేసులో మొదటి సమాచార నివేదిక (ఎఫ్ఐఆర్) దాఖలు చేయడానికి బగ్నాన్ పోలీసులు మొదట్లో నిరాకరించారు. స్థానిక బీజేపీ నాయకులు జోక్యం చేసుకున్నప్పుడు, ఉలుబెరియా లేడీస్ పోలీస్ స్టేషన్లో నిందితులపై కేసు నమోదు చేయబడింది. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తరువాత పోలీసులు చర్య తీసుకున్నారు. టీఎంసీ నాయకులు కుతుబుద్దీన్ మల్లిక్ మరియు దేబాషిష్ రాణాలను అరెస్టు చేశారు. మిగిలిన ముగ్గురు పరారీలో ఉన్నారు. మీడియా సంస్థలు తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు పులక్ రాయ్ను సంప్రదించినప్పుడు, అతను ఈ విషయంపై వ్యాఖ్యానించడానికి నిరాకరించాడు. బాధితురాలి భర్త మీడియాతో మాట్లాడుతూ “నేను ఉదయం 11 గంటలకు నా పని కోసం కోల్కతాకు వెళ్లాను. ఇంట్లో నా భార్య మరియు చిన్న కుమారుడు మాత్రమే ఉన్నారు. 12 గంటల సమయంలో, దుండగులు ఇంటి బయట నుండి ఆమెను పిలిచారు. ఆమె నేను వచ్చి ఉంటానని భావించి తలుపు తెరిచింది. లోపలికి చొరబడ్డ నిందితులు ఆమెను పట్టుకుని లైంగికంగా హింసించారు. టీఎంసీ పార్టీకి చెందిన వారే ఈ పని చేశారు” అని చెప్పుకొచ్చాడు. ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన ఇద్దరు నిందితులతో పాటు షాహిద్, జాయ్నల్ మల్లిక్, మహాబుల్ మల్లిక్ అనే మరో ముగ్గురు కూడా ఈ అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలి భర్త చెప్పుకొచ్చాడు.
రాజకీయ హింసలో భాగంగా అత్యాచారాలు
తృణమూల్ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే హిందువులపైనా, బీజేపీ కార్యకర్తలపైనా పెద్ద ఎత్తున దాడులు చోటు చేసుకుంటూ ఉన్నాయని మీడియా కథనాలు చెబుతూ ఉన్నాయి. ఇటీవల ముగిసిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన తర్వాత కోపంతో ఉన్న టీఎంసీ నేతల దారుణాలపై ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి. అత్యాచారం, హత్య, దాడి మరియు బెదిరింపులకు సంబంధించిన డజన్ల కొద్దీ ఫిర్యాదులు వెలుగులోకి వచ్చినా రాష్ట్ర ప్రభుత్వం తీరులో ఎటువంటి మార్పు లేదు. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ నివేదికలో కూడా.. ఎన్నికల తర్వాత తృణమూల్ గూండాలు మహిళలపై చేసిన అత్యాచార సంఘటనలు చాలా ఉన్నాయని తెలిపింది. బీజేపీ కార్యకర్తలు మరియు మద్దతుదారులు అధికార పార్టీ గూండాల నుండి విపరీతమైన వేధింపులు, హింసను ఎదుర్కొంటున్నారు. ఎన్హెచ్ఆర్సి నివేదికలో రాష్ట్ర పోలీసులు, అనేక కేసులలో ఫిర్యాదులను పట్టించుకోలేదని.. బాధితులను మరింత బాధపెట్టడానికి నేరస్తులతో కుమ్మక్కై పని చేశారని కూడా తెలిపింది.