కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం గురువారం పార్లమెంటు వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ ప్రాజెక్టు హోదా దక్కే అర్హత లేదని కేంద్రం తెలిపింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ లేదన్న కేంద్రం… ఈ కారణంగానే ఆ ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించలేమని తేల్చి చెప్పింది. ప్రాజెక్టుకు జాతీయ హోదా అర్హత లేదని కేంద్ర నీటి జలశక్తి సహాయ మంత్రి బిశ్వేశ్వర్ తుడు పేర్కొన్నారు. కాళేశ్వరానికి పెట్టుబడులు అనుమతులు లేవని.. ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని సీఎం కేసీఆర్ 2016, 2018లో ప్రధానికి లేఖలు రాసినట్లు పేర్కొంది. లోక్సభలో ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డి అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వకంగా కేంద్ర మంత్రి బిశ్వేశ్వర్ తుడు సమాధానం ఇచ్చారు.
ప్రాజెక్టుకు జాతీయ హోదా కావాలంటే.. సీడబ్ల్యూసీ అధ్యయనం తప్పనిసరని, ప్రాజెక్టు అడ్వైజరీ కమిటీ కూడా ఆమోదం ఉండాలని, ప్రాజెక్టు పెట్టుబడులపై కేంద్రం నుంచి అనుమతి తీసుకోవాలన్నారు. అనుమతులు ఉంటే కాళేశ్వరాన్ని హైపవర్ స్టీరింగ్ కమిటీ పరిశీలించాలని, హైపవర్ స్టీరింగ్ కమిటీ అనుమతి ఇస్తే కాళేశ్వరానికి జాతీయ హోదా అవకాశం ఉంటుందని లేఖలో కేంద్రమంత్రి పేర్కొన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని చిన్న చిన్న ప్రాజెక్టులకు కూడా జాతీయ హోదా ఇస్తున్న నరేంద్ర మోదీ సర్కారు… తెలంగాణలో కాళేశ్వరం వంటి పెద్ద ప్రాజెక్టులకు కూడా జాతీయ హోదా ఇవ్వడం లేదని టీఆర్ఎస్ ప్రభుత్వం ఆరోపిస్తోంది.