ఐసిస్ మద్దతు గల మ్యాగజైన్ ‘వాయిస్ ఆఫ్ హింద్’ కవర్ పేజీ అత్యంత వివాదాస్పదమైంది. శివుడి తల లేకుండా ఉన్న విగ్రహాన్ని కంప్యూటర్లో రూపొందించి.. ఆ ఫోటోను కవర్ పేజీగా ఉంచి కొత్త సంచికను విడుదల చేసింది. విగ్రహం కింద “ఇది తప్పుడు దేవుళ్లను విచ్ఛిన్నం చేసే సమయం” అని ఉంది. విగ్రహం తల లేని చోట ISIS జెండాను కూడా ఉంచారు. ఈ కవర్ సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లలో వైరల్ అవుతూ ఉండడంతో నెటిజన్లను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ చిత్రంలో ఉన్న విగ్రహం కర్ణాటకలోని మురుడేశ్వరలోని శివాలయంలో ఏర్పాటు చేసిన భగవాన్ శివుని విగ్రహాన్ని పోలి ఉంటుంది.
కర్నాటకలోని కుమటాకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే దినకర్ కేశవ్ శెట్టి ఈ చిత్రాన్ని తన ఫేస్బుక్ ఖాతాలో షేర్ చేస్తూ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. కన్నడ భాషలో పోస్ట్ చేస్తూ.. “మురుడేశ్వర ఆలయంలోని శివ విగ్రహాన్ని ధ్వంసం చేస్తామని ఉగ్రవాద సంస్థ ISIS యొక్క ‘వాయిస్ ఆఫ్ హింద్’ పత్రిక ప్రకటించినట్లు సోషల్ మీడియా ద్వారా నా దృష్టికి వచ్చింది. హిందూ దేవాలయాల రక్షణ, అభివృద్ధి మా పార్టీ ప్రధాన సూత్రాలలో ఒకటి. మన రక్షణ శాఖ అటువంటి బెదిరింపులకు వ్యతిరేకంగా బలమైన చర్యలను తీసుకుంటూ ఉంది. ఇప్పటికే ఫోన్ ద్వారా హోంమంత్రికి సమాచారం చేరవేశామని, త్వరలో మురుడేశ్వర ఆలయం వద్ద అదనపు భద్రత కల్పిస్తాని తెలిపారు” అని దినకర్ కేశవ్ శెట్టి తెలిపారు.
వాయిస్ ఆఫ్ హింద్ పత్రికపై భారత ప్రభుత్వం తీసుకున్న చర్యలు:
ఫిబ్రవరి 2020లో ISIS అనుకూల మీడియా సంస్థ అల్-ఖితాల్ మీడియా సెంటర్, జునుదుల్ ఖిలాఫహ్ అల్-హింద్ ‘వాయిస్ ఆఫ్ హింద్’ పత్రికను ప్రారంభించాయి. ది ప్రింట్లో సెప్టెంబర్ 2021 నుండి వచ్చిన నివేదిక ప్రకారం, పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్లలో ‘కాల్ సెంటర్ తరహా సెటప్’లో ప్రచార మ్యాగజైన్ తయారు చేయబడిందని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) తెలిపింది. అర్హతగల గ్రాడ్యుయేట్లు మరియు అనువాదకులు ఈ పత్రికను ఒకచోట చేర్చడానికి కృషి చేస్తున్నారు.
మొదట్లో ఈ పత్రిక ఆఫ్ఘనిస్తాన్ నుండి ఉద్భవించిందని భావించారు, కాని తరువాత సాంకేతిక నిపుణుల సహాయంతో వారు దక్షిణ కాశ్మీర్ తో లింక్ లు ఉన్నాయని గుర్తించారు. మ్యాగజైన్ పాక్ లో ఎడిట్ చేయబడుతోందని, కంటెంట్ సృష్టికర్తలను మాల్దీవులు, బంగ్లాదేశ్ నుండి నియమించుకున్నారని నివేదిక పేర్కొంది. జూలై 2021లో, NIA అనంత్నాగ్కు చెందిన ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసింది. వీరిని ఉమర్ నిసార్, తన్వీర్ అహ్మద్ భట్ మరియు రమీజ్ అహ్మద్ లోన్ అని గుర్తించారు. వీరు ప్రచార కంటెంట్ను సేకరించి యువతలో ప్రచారం చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. వాయిస్ ఆఫ్ హింద్ నకిలీ ఆన్లైన్ ఎంటిటీలతో కూడిన సంక్లిష్ట నెట్వర్క్ ద్వారా పంపిణీ చేయబడుతోంది. VPN ద్వారా నిజమైన గుర్తింపులను దాచిపెడుతూ ఉన్నారు. మ్యాగజైన్ కోసం ఉపయోగించిన మొబైల్ ఫోన్లు, హార్డ్ డిస్క్లు, ఎస్డీ కార్డ్లు తదితర డిజిటల్ పరికరాలను పెద్ద సంఖ్యలో స్వాధీనం చేసుకున్నట్లు ఎన్ఐఏ తెలిపింది. ఆగస్ట్ 2021లో, NIA కర్ణాటకలోని భత్కల్కు చెందిన జుఫ్రీ జవహర్ దాముడి అలియాస్ అబూ హజీర్ అల్ బద్రీగా గుర్తించబడిన కీలకమైన ఇస్లామిక్ స్టేట్ ఆపరేటివ్ను అరెస్టు చేసింది. అమీన్ జుహైబ్ అనే మరో కార్యకర్తను కూడా అరెస్టు చేశారు. VOH మ్యాగజైన్పై ఏజెన్సీ విచారణకు సంబంధించి ఈ అరెస్టులు జరిగాయి. అక్టోబర్ 2021లో ISIS ప్రచార పత్రిక ప్రచురణకు సంబంధించి NIA కాశ్మీర్లో అనేక దాడులు నిర్వహించింది.
