టీ20 ప్రపంచకప్ లో ఈ ఆదివారం ఆసక్తికరమైన మ్యాచ్ జరగబోతోంది. అదే భారత్-పాక్ మధ్య మ్యాచ్. ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తూ ఉన్నారు. 2007లో టీ20 ప్రపంచకప్ ఆరంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు భారత్-పాక్ జట్లు 5 సార్లు తలపడితే.. ఐదు సార్లు టీమిండియానే విజయం సాధించింది.
భారత శిబిరంలో ఈ మ్యాచ్ గురించి ఎంతో ప్రశాంతత నెలకొంది. అయితే పాకిస్తాన్ మీడియా మాత్రం తమ జట్టు గొప్పగా ఉంది.. ఈసారి భారత్ ను చిత్తు చిత్తు చేస్తుందంటూ ప్రచారం చేసుకుంటూ ఉంది. పలువురు పాక్ మాజీ క్రికెటర్లు కూడా భారత్ ను పాక్ ఓడించబోతోందనే వ్యాఖ్యలు చేశారు. ఇక ఈ ప్రచారంపై భారత మాజీ క్రికెటర్ వీరేందర్ సెహ్వాగ్ స్పందించారు. ప్రపంచకప్ చరిత్రలో పాక్ కంటే భారత్ మెరుగైన స్థితిలో ఉండటంతో.. 2003, 2011 ప్రపంచకప్లో ఎలాంటి ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా ఆడగలిగామని సెహ్వాగ్ చెప్పుకొచ్చారు. మేమెప్పుడూ సానుకూల వైఖరితోనే ఆడతామని.. పాకిస్తాన్లా గొప్పలు చెబుతూ కూర్చోమని అన్నారు. మ్యాచ్ను దృష్టిలో పెట్టుకుని ప్రణాలికలు రచిస్తే విజయాలు దక్కుతాయని అన్నారు. టీ20ల్లో పాకిస్థాన్ కాస్త మెరుగ్గా కనిపిస్తోందని అన్నారు. ఈ మ్యాచ్లో పాకిస్థాన్కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని.. ఎందుకంటే ఇది 50 ఓవర్ల మ్యాచ్ కాదు.. పొట్టి క్రికెట్లో ఒక్క ఆటగాడు రాణించినా మ్యాచ్ ఫలితాలు తారుమారు అయిపోతాయని అన్నారు. అయితే పాక్ భారత్ తో మ్యాచ్ లో ఇప్పటివరకు అలా చేయలేకపోయిందని.. అక్టోబరు 24న ఏం జరుగుతుందో చూద్దామని అన్నారు.