భారత్-కెనడా దేశాల మధ్య సంబంధాలు అంతంత మాత్రమే ఉన్నాయి. కెనడా ప్రభుత్వం ఖలిస్థాన్ తీవ్రవాదులకు మద్దతు తెలుపుతూ ప్రకటనలు చేస్తూ ఉండడంతో భారత్ కూడా ఘాటుగా స్పందించింది. మరో వైపు పలువురు కెనడియన్ సింగర్లకు భారత్ లో అభిమానులు ఉన్నారు. భారత క్రికెటర్ విరాట్ కోహ్లీకి ఫేవరెట్ సింగర్ కూడా కెనడియన్ సింగర్. అయితే విరాట్ కోహ్లీ ఇప్పుడు అతడిని అన్ ఫాలో చేయడం హాట్ టాపిక్ గా మారింది.
సోషల్ మీడియాలో భారత మ్యాప్ను వక్రీకరించిన చిత్రాన్ని పోస్ట్ చేసినందుకు కెనడియన్ గాయకుడు శుభ్ను విరాట్ కోహ్లీ ఇన్స్టాగ్రామ్లో అన్ఫాలో చేశాడు. పంజాబీ రాపర్ ఖలిస్తానీ వేర్పాటువాదులకు మద్దతు ఇస్తున్నాడని ఆరోపణలు వచ్చాయి. అతని ఇటీవలి ఇన్స్టా పోస్టు కూడా భారతదేశ ప్రజల ఆగ్రహాన్ని చవిచూసింది. ఇటీవల తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో వక్రీకరించిన భారతదేశ మ్యాప్ ను పోస్ట్ చేశాడు. ఇక తన పోస్ట్ లో పంజాబ్, హర్యానాలను ప్రత్యేక దేశాలుగా చూపించారు. దీంతో దేశవ్యాప్తంగా శుభ్ పై విమర్శలు వెల్లువెత్తాయి. శుభ్ సంగీతం అంటే విరాట్ కోహ్లికి ఇష్టం. గతంలో అతడిపై ఓ ట్వీట్ వేసి విరాట్ కోహ్లీ తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు. అయితే శుభ్ భారత వ్యతిరేక శక్తులకు తోడ్పాటును అందిస్తూ ఉన్నాడనే ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నాడు. అందుకే విరాట్ కోహ్లీ ర్యాపర్ శుభ్ ను అన్ ఫాలో చేశాడు. 2023 IPL సమయంలో కోహ్లీ-అనుష్క శర్మలు శుభ్ ఎలివేటెడ్ పాటకు జిమ్ లో డ్యాన్స్ చేశారు. ఈ డ్యాన్స్ అప్పట్లో వైరల్ గా మారింది. శుభ్ పాటలకు ఒకప్పుడు డ్యాన్స్ లు వేసిన విరాట్ కోహ్లీ ఇప్పుడు అతడిని దూరం పెట్టాడు.
త్వరలో శుభ్ భారత్ లోని పలు ప్రాంతాల్లో మ్యూజికల్ టూర్లకు రావాల్సి ఉండగా ఇప్పుడు అతడు వచ్చేది అనుమానమేనని తెలుస్తోంది. భారతీయ జనతా యువ మోర్చాకి చెందిన పలువురు సభ్యులు శుభ్ వేర్పాటువాద ఖలిస్తానీలకు మద్దతు ఇస్తున్నాడని ఆరోపించారు. పరారీలో ఉన్న అమృతపాల్ సింగ్పై పంజాబ్ పోలీసులు వేట సాగిస్తున్న సమయంలో శుభ్ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పంజాబ్, జమ్మూ-కాశ్మీర్ లేకుండా వక్రీకరించిన భారతదేశ మ్యాప్ను పోస్టు చేయడం ఇంటర్నెట్లో వైరల్ అయింది. అప్పటి నుండి భారతీయులు అతడిపై కన్నెర్ర జేస్తున్నారు.
ఇక భారతదేశంలో అతడి ప్రదర్శనలను రద్దు చేయాలని BJYM ముంబై నేతలు డిమాండ్ చేశారు. భారతదేశ సమగ్రత, ఐక్యతకు శత్రువులైన ఖలిస్తానీలకు ఈ దేశంలో స్థానం లేదన్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ నడియాడిన పవిత్ర స్థలంలో కెనడియన్ గాయకుడు శుభ్ ప్రదర్శన ఇవ్వడానికి తాము ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించమని తేల్చి చెప్పారు. ఇక్కడ అతడు సంపాదించే డబ్బు దేశ వ్యతిరేక శక్తుల చేతుల్లోకి వెళుతుందని కూడా పలువురు ఆరోపించారు. నెటిజన్లు కూడా శుభ్ కాన్సర్ట్ ను నిర్వహించకూడదని డిమాండ్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.