విశాఖ రైల్వే జోన్ గురించి చర్చకే రాలేదని అంటున్న విజయసాయి రెడ్డి

0
867

విశాఖపట్టణంలో రైల్వే జోన్ ఏర్పాటు చేయడం సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం తేల్చిచెప్పేసిందంటూ వార్తలు వచ్చాయి. విభజన సమస్యలు, హామీలపై ఢిల్లీలో కేంద్ర హోంశాఖ సమావేశం నిర్వహించింది. హోంశాఖ కార్యదర్శి అజయ్‌భల్లా నేతృత్వంలో రెండు గంటలకుపైగా ఈ సమావేశం జరిగింది. ఏపీ, తెలంగాణకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో రైల్వే జోన్, విభజన సమస్యలు సహా మొత్తం 14 అంశాలపై చర్చ జరిగింది. ఈ సమావేశంలో విశాఖకు రైల్వే జోన్ ఏర్పాటు సాధ్యం కాదని చెప్పింది. జోన్ ఏర్పాటు లాభదాయకం కాదని, అందుకనే డీపీఆర్‌ను ఆమోదించలేదని రైల్వే బోర్డు చైర్మన్ పేర్కొన్నారని పలు మీడియా సంస్థలు కథనాలను ప్రసారం చేశాయి.

ఈ వార్తలపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి స్పందించారు. ఇదంతా తప్పుడు ప్రచారమని.. కొందరు పని కట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సమావేశంలో విశాఖ రైల్వే జోన్ అంశం చర్చకే రాలేదని చెప్పారు. విశాఖ రైల్వే జోన్ వచ్చి తీరుతుందని.. రైల్వే జోన్ రాకపోతే రాజీనామా చేస్తానని అన్నారు. విశాఖ రైల్వే జోన్ అనేది విభజన చట్టంలో చాలా స్పష్టంగా ఉందని విజయసాయి అన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా రైల్వే జోన్ ఇచ్చేందుకు ఆమోదం తెలిపిందని చెప్పారు.