బాలీవుడ్ దిగ్గజం దిలీప్ కుమార్ కన్నుమూత

బాలీవుడ్ నట దిగ్గజం దిలీప్ కుమార్ కన్నుమూశారు. 98 సంవత్సరాల వయసులో ఆయన తుదిశ్వాస విడిచారు. ముంబైలోని హిందూజా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దిలీప్ కుమార్ ఈ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. శ్వాస సమస్యతో గత బుధవారం ఆయన ఆసుపత్రిలో చేరారు. జూన్ 6న తొలుత ఆయనను ఆసుపత్రిలో చేర్చగా ఆక్సిజన్ సపోర్ట్తో చికిత్స అందించారు. చికిత్స అనంతరం ఆరోగ్యం కుదుట పడడంతో అదే నెల 11న డిశ్చార్జ్ చేశారు. ఇంతలో ఆయనకు మరోసారి అనారోగ్యం బాధించడంతో ప్రాణాలు కోల్పోయారు. కిడ్నీ, న్యూమోనియా వంటి సమస్యలతో దిలీప్ కుమార్ బాధపడుతూ ఉన్నారు. గతేడాది దిలీప్ కుమార్ సోదరులు అస్లాంఖాన్, ఇషాన్ ఖాన్లు కరోనాతో ప్రాణాలు విడిచిన విషయం తెలిసిందే. ఈ విషాదం నుంచి కోలుకోక ముందే దిలీప్ కూడా కన్నుమూయడంతో ఆయన కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.

దిలీప్ కుమార్ అసలు పేరు యూసుఫ్ ఖాన్. 1 డిసెంబరు 1922లో పాకిస్థాన్లోని పెషావర్లో జన్మించిన దిలీప్ కుమార్ సినిమాల్లోకి రాకముందు తండ్రితో కలిసి పండ్లు అమ్మారు. ఆ తర్వాత ఎంతో కష్టపడి సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు. 1944లో తొలిసారి ‘జ్వర్ ఖాతా’ అనే సినిమాతో బాలీవుడ్లో అరంగేట్రం చేశారు. నయా దౌర్, మొఘల్-ఏ-అజామ్, దేవ్దాస్, రామ్ ఔర్ శ్యామ్, అందాజ్, మధుమతి, గంగా జమున వంటి గొప్ప సినిమాల్లో నటించారు. 1940లలో ప్రారంభమైన ఆయన సినీ ప్రస్థానం కొన్ని దశాబ్దాలపాటు కొనసాగింది. 1955లో ఆజాద్, దేవదాస్ సినిమాలతో బిగ్గెస్ట్ హిట్లను తన ఖాతాలో వేసుకున్నారు. ‘ఆజాద్’ ఆ దశాబ్దిలోనే అధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డుకెక్కింది. 1980ల నుంచి కేరెక్టర్ ఆర్టిస్ట్గా మారి క్రాంతి, శక్తి, కర్మ, సౌదాగర్ వంటి సినిమాల్లో నటించారు. 1998లో వచ్చిన ‘ఖిలా’ దిలీప్ కుమార్ చివరి సినిమా.
ఉత్తమ నటుడిగా ఆయనకు 8 సార్లు ఫిల్మ్ఫేర్ అవార్డులు, 1993లో ఫిలింఫేర్ లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డు దక్కింది. 1994లో దిలీప్కుమార్ను దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వరించింది. ప్రభుత్వం 1991లో పద్మభూషణ్, 2015లో పద్మవిభూషణ్ పురస్కారాలతో ఆయనను సన్మానించింది.
