More

    గొడవ పడుతున్న ఇద్దరి దగ్గరకు పోలీసులు వెళ్లారు.. సంచలన విషయం బయటకు

    విరుదునగర్‌లో ఇద్దరు డీఎంకే నేతలు నిందితులుగా ఉన్న గ్యాంగ్‌రేప్ కేసులో న్యాయం చేస్తామని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ హామీ ఇవ్వగా.. మరో వైపు రాష్ట్రంలో గత వారం జరిగిన మరో గ్యాంగ్ రేప్ కేసు వెలుగులోకి వచ్చింది. ఢిల్లీలోని నిర్భయ రేప్ కేసుకు చాలా దగ్గర పోలిక ఉన్న కేసు ఇది. వెల్లూరులో మార్చి 16న ఒక మహిళ తన స్నేహితుడితో కలిసి ఆటోరిక్షాలో వెళుతుండగా.. ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసులో నలుగురు నిందితులను మంగళవారం అరెస్టు చేయడంతో ఈ కేసు గురించి బయటకు తెలిసింది. ఇద్దరు యువకులతో సహా ఐదుగురు వ్యక్తులు మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఒక నిందితుడు ఇప్పటికీ పరారీలో ఉన్నాడు.

    జీ న్యూస్ జర్నలిస్ట్ ఆదిరా ఆనంద్ తెలిపిన వివరాల ప్రకారం.. మార్చి 19న వీధిలో గొడవకు దిగిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దొంగిలించిన వస్తువులను పంచుకోవడంపై వారు గొడవపడుతుండగా, మార్చి 16వ తేదీన ఓ మహిళపై సామూహిక అత్యాచారం చేశామని, బాధితురాలి నుంచి దోచుకున్న డబ్బు, వస్తువులు పంచుకునే విషయంలో గొడవ పడ్డామని విచారణలో అంగీకరించారు.

    అత్యాచారం జరిగినట్లు తమకు ఎలాంటి ఫిర్యాదు అందకపోవడంతో పోలీసులు ఆశ్చర్యానికి గురయ్యారు. అయితే బాధితురాలు తన పేరు చెప్పకుండా వేలూరు ఎస్పీ కార్యాలయానికి ఇమెయిల్ పంపడం ద్వారా నిజంగానే ఫిర్యాదు చేసినట్లు తర్వాత తేలింది. ఇద్దరు వ్యక్తులు నేరం అంగీకరించడంతో, పోలీసులు కేసు వివరాలను తెలుసుకున్నారు.

    16వ తేదీన ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తున్న మహిళ, ఆమె ప్రియుడు సినిమా నైట్ షో చూసి తిరిగి ఆసుపత్రికి వస్తున్నారని పోలీసులు తెలిపారు. డ్రైవర్‌తో సహా ఐదుగురు వ్యక్తులతో ఆటో రిక్షా వారి వద్దకు వచ్చి.. ఇది షేర్ ఆటో అని చెప్పి ఎక్కమని అడిగారు. మొదట్లో సందేహించినా వాహనం ఎక్కారు. అయితే కొంతదూరం వెళ్లాక, ఆటో దారి మళ్లడంతో, ఏదో తప్పు జరిగిందని గ్రహించిన ఆ జంట కేకలు వేయడం ప్రారంభించారు. ఐదుగురు వ్యక్తులు వారిని పట్టుకుని నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లారు. ఆటోలో ఉన్న వ్యక్తులు కత్తితో బెదిరించి మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం నిందితులు వారి వద్ద ఉన్న మొబైల్ ఫోన్లు, రెండు సవర్ల బంగారు ఆభరణాలను కూడా ఎత్తుకెళ్లారు. వారు ఆ వ్యక్తిని సమీపంలోని ఏటీఎంకు తీసుకెళ్లి రూ.40 వేలు డ్రా చేయమని బలవంతం చేశారు.

    19వ తేదీన పోలీసులు పట్టుకున్న ఇద్దరు వ్యక్తులు వారి దగ్గర నుండి దోచుకున్న రూ. 40,000 పంపకాలపై గొడవ పడుతూ ఉండగా.. విచారణలో వారు “అత్యాచారం” చేశారని తెలిపారు. తదుపరి విచారణలో, ఇద్దరు మొత్తం విషయాన్ని పోలీసులకు వెల్లడించారు. కస్టడీలో ఉన్న ఇద్దరు వ్యక్తులు ఇచ్చిన సమాచారం ఆధారంగా, పోలీసులు నిందితులు డబ్బును దోచుకున్న బ్యాంకును సంప్రదించారు. అకౌంట్ హోల్డర్‌ను సంప్రదించగా డబ్బులు దోచుకున్నారని, అలాగే తన స్నేహితురాలిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడని వెల్లడించారు. అనంతరం పోలీసులు బాధితురాలితో మాట్లాడి అధికారికంగా ఫిర్యాదు చేసేందుకు ఆమెను ఒప్పించారు.

    మార్చి 22న ఫిర్యాదు అందడంతో పోలీసులు కేసు నమోదు చేసి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, ఐదో నిందితుడి కోసం గాలిస్తున్నారు. అరెస్టయిన నలుగురిలో ఇద్దరి పేర్లు సంతోష్, మణికందన్ కాగా, మిగతా ఇద్దరు మైనర్లు కావడంతో వారిని జువైనల్ హోంకు తరలించారు. బాధిత మహిళ బీహార్‌కు చెందినది కాగా, ఆమె స్నేహితుడు నాగ్‌పూర్‌కు చెందిన వాడు. వారిద్దరూ ఒకే ఆసుపత్రిలో పనిచేస్తున్నారు. వెల్లూరు నార్త్ పోలీస్ స్టేషన్‌లో పలు IPC సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

    Trending Stories

    Related Stories