గంధపుచెక్కల స్మగ్లర్ వీరప్పన్ పెద్దన్న మత్తయ్యన్ కన్నుమూశాడు. గుండెపోటుతో సేలం ప్రభుత్వ ఆస్పత్రిలో బుధవారం ఉదయం మృతి చెందినట్లు సమాచారం.
1987లో ఫారెస్ట్ రేంజర్ చిదంబరంను హత్య చేసిన కేసులో.. ఈరోడ్ జిల్లా బంగ్లాపూడుర్ పోలీసులు మత్తయ్యన్ను అరెస్ట్ చేశారు. కోయంబత్తూరు సెంట్రల్ జైలులో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్నాడు. 34 ఏళ్ల నుంచి జైలులోనే ఉన్నాడు. ఈ కేసులో ఈయన్ని విడుదల చేయాలంటూ పలు పిటిషన్లు సైతం తెర మీదకు వచ్చాయి. కొన్ని నెలలకు ముందు వృద్ధాప్య సమస్యల కారణంగా అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందాడు.
తర్వాత పదిహేను రోజులకు ముందు గుండెపోట వచ్చింది. దీంతో పోలీసులు ఆయనను సేలం ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందించారు. రెండు రోజుల క్రితం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయి జైలుకు తిరిగి వెళ్ళారు. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి మళ్ళీ మాతయ్యన్కు గుండెపోటు వచ్చింది. పోలీసులు వెంటనే అతడిని సేలం ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. ఈ తరుణంలో బుధవారం ఉదయం ఆయన గుండెపోటుతో మరణించారు.