బంగ్లాదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ క్రిమినల్ ను ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజధాని లక్నోలో హతం చేశారు పోలీసులు. సోమవారం ఉదయం ఈ ఎన్కౌంటర్ జరిగింది. 50 వేల రూపాయలు రివార్డు ఉన్న బంగ్లాదేశ్ క్రిమినల్ హమ్జాను యూపీ పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. గడిచిన రెండేండ్లలో మూడు దోపిడీ కేసుల్లో హమ్జా ప్రధాన సూత్రధారిగా ఉన్నట్లు యూపీ పోలీసులు తెలిపారు. ఢిల్లీతో పాటు మరో మూడు రాష్ట్రాల్లో హమ్జా ముఠా దోపిడీలకు పాల్పడింది. బంగ్లాదేశ్లోని ఖుల్నా జిల్లాకు చెందిన హమ్జా రూ. 10 వేలు లంచం ఇచ్చి భారత్లోకి ప్రవేశించినట్లు పోలీసులు తెలిపారు. సోమవారం తెల్లవారుజామున 2:45 గంటలకు లోహియా పార్కు వద్ద ఆయుధాలను కలిగిన వ్యక్తులను పెట్రోలింగ్ పోలీసులు గుర్తించారు. దీంతో వారిపై పోలీసులు కాల్పులు జరిపారు.
గత వారం అరెస్టయిన ఓ ముఠాకు చెందిన ముగ్గురు సభ్యులను విచారించినప్పుడు హమ్జా పేరు బయటకు వచ్చిందని పోలీసు అధికారి చెప్పారు. “తెల్లవారుజామున 2.45 గంటల సమయంలో, గోమతీనగర్ లోని లోహియా పార్క్ సమీపంలో కొందరు వ్యక్తులు తుపాకులు తీసుకుని వెళ్తుండడాన్ని పోలీసులు గుర్తించారు. వారిని ఆగమని కోరారు. అయితే వాళ్లు పారిపోడానికి ప్రయత్నించారు. పోలీసు సిబ్బంది వారిని వెంబడించడంతో వారు పరుగెత్తడం ప్రారంభించారు. ఆ సమయంలో పోలీసు బృందంపై కాల్పులు జరిపారు. దీంతో పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. హమ్జా ఈ కాల్పుల్లో చనిపోగా మరికొందరు తప్పించుకున్నారు “అని ఈస్ట్ జోన్ పోలీసు డిప్యూటీ కమిషనర్ సంజీవ్ సుమన్ అన్నారు. ఎదురుకాల్పుల్లో ముగ్గురు పోలీసులకు గాయాలయ్యాయి.