ఉత్తరప్రదేశ్లోని బరేలీ ప్రాంతంలో చెరకు రసంలోకి గొడ్డు మాంసం కలిపి విక్రయిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫుజైల్ అనే వ్యక్తికి అలహాబాద్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అతన్ని నవంబర్ 30, 2022న బరేలీ జిల్లాలోని ప్రేమ్ నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పలు సెక్షన్స్ కింద కేసులు నమోదు చేశారు. అతని కస్టమర్లలో ఒకరు చేసిన ఫిర్యాదు ఫలితంగా అతనిపై కేసు నమోదైంది. ఎఫ్ఐఆర్ లోని వాదనలు, సాక్ష్యాలు, నిందితుల సంక్లిష్టత, సుప్రీంకోర్టు నిబంధనలను పరిగణనలోకి తీసుకున్న సింగిల్ జడ్జి బెంచ్ నిందితుడికి బెయిల్ మంజూరు చేసింది. అతడికి బెయిల్ ఇవ్వడాన్ని రాష్ట్ర న్యాయవాది వ్యతిరేకించినప్పటికీ, కోర్టు ఫుజైల్కు అనుకూలంగా జస్టిస్ దీపక్ వర్మ తీర్పును ఇచ్చారు.
దరఖాస్తుదారు తరఫు న్యాయవాది హసన్ పర్వేజ్ వాదిస్తూ, అతను నిర్దోషి అని, దుర్మార్గపు కారణాలతో ఈ కేసులో తప్పుగా నిందితుడిని చేశారని ఆరోపించారు. ఫుజైల్ చెరుకు రసం అమ్ముతూ ఉంటాడని, చెల్లింపు విషయంలో విభేదాలు తలెత్తడంతో ఫిర్యాదుదారుడు గొడ్డు మాంసం కలిపిన జ్యూస్ను అమ్ముతున్నాడని తప్పుడు ఆరోపణలు చేసి ఎఫ్ఐఆర్ దాఖలు చేశాడని హసన్ పర్వేజ్ వాదనలు వినిపించారు. ఆరోపించిన సంఘటనకు సంబంధించి ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ రిపోర్ట్ లేదని తెలిపారు. ఎఫ్.ఐ.ఆర్.లో ఉన్నట్లు సెక్షన్ల ఉల్లంఘన ఏదీ కనిపించలేదని అన్నారు. ఫుజైల్ నవంబర్ 30, 2022 నుండి జైలులో ఉంటున్నాడు. తన క్లయింట్కు బెయిల్ మంజూరు చేస్తే, అతను ప్రాసిక్యూషన్కు సహకరిస్తానని కోర్టుకు హామీ ఇచ్చారు. బెయిల్పై విడుదలైన తర్వాత, నిందితులు సాక్షులను బెదిరించడం, ఒత్తిడి చేయడం ద్వారా ప్రాసిక్యూషన్ సాక్ష్యాలను తారుమారు చేయకూడదని కోర్టు హెచ్చరించింది. షరతుల్లో దేనినైనా అతిక్రమిస్తే బెయిల్ను రద్దు చేస్తామని కోర్టు ఉత్తర్వుల్లో చెప్పింది.