భారత్ యూపీఐ పేమెంట్ ప్లాట్ఫామ్స్ విశ్వవ్యాప్తమయ్యే దిశగా మరో అడుగుపడింది. ఇప్పటికే సింగపూర్, అరబ్, ఒమన్, మలేషియాలతో పాటు ఇతర దేశాల్లో కూడా యూపీఐ పేమెంట్స్ అందుబాటులోకి రాగా.. మరికొన్ని రోజుల్లో యూరప్లో కూడా అందుబాటులోకి తెచ్చేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా.. యూరోపియన్ పేమెంట్స్ ప్రొవైడర్స్ తో సంప్రదింపులు జరుపుతోంది. ఈ చర్చలు సఫలమైతే మరికొన్ని రోజుల్లో దాదాపు అన్ని దేశాలూ యూపీఐను అంగీకరించే స్థితికి భారత్ చేరుకుంటుంది.
భారత్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కోసం ప్రత్యేకమైన టెక్నాలజీ రూపొందించింది. భారత్లో డిజిటల్ చెల్లింపులను సామాన్యులకు సైతం అందుబాటులోకి వచ్చేలా ఈ టెక్నాలజీ సహాయపడింది. ఇందులో భాగంగా పనిచేసిన నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దేశంలోని ప్రతి బ్యాంకునూ ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చి ఒక్కో ఖాతాదారుడికీ ఒక్కో క్యూఆర్ కోడ్ ను సృష్టించింది. బ్యాంకులతో సంబంధం లేకుండా క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే అవతలి వ్యక్తి బ్యాంకు డీటెయిల్స్ వచ్చేలా వీటిని రూపొందించారు. ఇందులో యూపీఐ, ఫాస్టాగ్, ‘భారత్ బిల్ పే’ లాంటి అనేక పేమెంట్ వ్యవస్థలను చేర్చడం వల్ల ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ మరింత సులభతరంగా మారాయి. దీంతో పేమెంట్ చేసేవారికి ఎటువంటి బ్యాంకు డీటెయిల్స్ అవసరం లేకుండా, ఏటీఎం క్రెడిట్ కార్డుల సహాయం కూడా లేకుండా ట్రాన్సాక్షన్స్ చేసే వీలు కలిగింది. సాధారణంగా క్రెడిట్, డెబిట్ కార్డులతో ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేయాలంటే వాటిని స్కాన్ చేయడానికి ఎలక్ట్రానిక్ మిషన్లు ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ ఎలక్ట్రానిక్స్ అధిక ధరలుండటం నుంచి తరచూ రిపేర్లు వంటివి రావడంతో పెద్ద పెద్ద కంపెనీలు తప్ప చిరు వ్యాపారులు వీటిని వినియోగించలేకపోయారు. అందుకే క్యూఆర్ కోడ్ సిస్టం రాకముందు ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువగా జరిగేవి కావు. కొత్తగా వచ్చిన క్యూఆర్ కోడ్ సిస్టంతో ఏ విధమైన మిషన్ కొనే అవసరం లేకుండా కేవలం క్యూఆర్ కోడ్ తో ట్రాన్సాక్షన్ అవడంతో దీని వినియోగం సులభతరం అయింది. నేటి కాలంలో అందరి చేతిలో స్మార్ట్ ఫోన్లు ఉండటం వల్ల డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఊపందుకున్నాయి.
ఈ విధంగా కొత్త టెక్నాలజీతో మొదలైన యూపీఐ పేమెంట్ వినియోగం భారత్లో క్రమంగా పెరుగుతూ వచ్చాయి. 2017-2018 ఆర్థిక సంవత్సరంలో వెయ్యి కోట్ల ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ జరగగా 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఇది ఏకంగా 42 వేల 974 కోట్లకు పెరిగింది. సరిగ్గా మూడేళ్ళ కాలంలోనే ఏకంగా నలభై రెండు శాతం పెరిగాయి. భారత్లో చిరు వ్యాపారులు సైతం డిజిటల్ ట్రాన్సాక్షన్స్ను వినియోగించడం మొదలుపెట్టారు. దీంతో ప్రత్యక్ష నగదు బదిలీను చాలావరకు తగ్గిపోయింది. భారత్లో చిన్న టీకొట్టు పెట్టుకున్నవారు కూడా నగదుకు చిల్లర డబ్బులు లేవనీ,.. ఫోన్ పే చేయమని చెప్పే రోజులకు వచ్చింది.
అయితే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ సిస్టం కేవలం భారత్లోనే కాకుండా ప్రపంచదేశాలను సైతం ఆకర్షించింది. తాజాగా ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్ కూడా భారత యూపీఐ ట్రాన్సాక్షన్స్ ను ప్రశంసించింది. భారత యూపీఐ సిస్టంను ఒక లాజిస్టిక్ మార్వెల్గా అభివర్ణించింది. ఐఎంఎఫ్ ఫిజికల్ అఫైర్స్ డిపార్ట్మెంట్ డిప్యూటీ డైరెక్టర్ పాలో మౌరో భారత టెక్నాలజీ నుండి ప్రపంచదేశాలు చాలా నేర్చుకోవాల్సి ఉందన్నారు. తక్కువ ఆదాయం ఉన్నవారికి కూడా సహాయపడేలా రూపొందించిన భారత యూపీఐ సిస్టం ఎంతో గొప్పదని అభివర్ణించారు. ఆధార్ నుండి యూపీఐ వరకు భారత్ వినియోగించిన టెక్నాలజీ తార్కిక అద్భతమని పాలో మౌరో అన్నారు.
ఇక ఈ యూపీఐ సిస్టం ఇంతగా అభివృద్ది చెందడానికి దాన్ని విశ్వవ్యాప్తం చేయడానికి భారత ప్రభుత్వ కృషి కూడా చాలా ఉంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సామాన్య ప్రజలకు కూడా ఉపయోగపడేలా చేయడానికి ప్రభుత్వం తరపున ప్రత్యేకంగా కృషి చేశారు. అంతేకాదు ప్రజలందరితో యూపీఐ ఉపయోగించేలా ప్రోత్సహించడం వంటివి చేశారు. దీంతోపాటు తన నాయకత్వంతో ప్రపంచదేశాలను సైతం భారత యూపీఐ తో పాటు రూపీ కార్డులను ఉపయోగించేలా ఒప్పించారు. దీంతో మెల్లి మెల్లిగా భారత యూపీఐ తో పాటు రూపే కార్డులను ఆయా దేశాలు అంగీకరించడం మొదలుపెట్టాయి. ఇప్పటికే చిన్న చిన్న దేశాలతో పాటు సౌదీ, సింగపూర్ లాంటి దేశాలు భారత్ యూపీఐ తో పాటుగా రూపీ కార్డులను అంగీకరిచంగా ఇప్పుడు యూరప్ పేమెంట్ ప్రొవైడర్స్ తో కూడా సంప్రదింపులు జరుపుతున్నాయి. దీంతో భారత్ టెక్నాలజీ పరంగా ప్రపంచదేశాలకు దిశా నిర్దేషం చేసే స్థాయికి క్రమంగా ఎదుగుతోంది.