కొత్త పార్లమెంట్ ను పాక్ ప్రధాని ప్రారంభిస్తాడా..? కాంగ్రెస్ నేత కీలక వ్యాఖ్యలు..!

0
347

భారత నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవంపై వివాదం కొనసాగుతూనే ఉంది. ప్రధాని మోదీ దీనిని ఓపెన్ చేయటంపై కాంగ్రెస్ సహా కొన్ని విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. అయితే పార్లమెంట్ నూతన భవన ప్రారంభోత్సవంపై కాంగ్రెస్ పార్టీలోనే భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. భవన ఓపెనింగ్ ని బాయ్ కాట్ చేయాలని తమ పార్టీతో సహా విపక్షాలు తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ నేత ప్రమోద్ ఆచార్య సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత ప్రధాని కాకపోతే మరి దీన్ని పాకిస్తాన్ ప్రధానమంత్రి ప్రారంభిస్తారా అని ఎద్దేవా చేశారు. మోదీని వ్యతిరేకించే హక్కు మనకు ఉందని, కానీ దేశాన్ని వ్యతిరేకించే హక్కు లేదని ఆయన అన్నారు. విపక్షాలు తమ నిర్ణయంపై పునరాలోచించుకోవాలని కోరారు. పార్లమెంట్ హౌస్ ని వ్యతిరేకించడం సబబు కాదని, ఈ భవనం మొత్తం దేశానిదని ఆయన చెప్పుకొచ్చారు.

తాను మాట్లాడిన కొన్ని విషయాలను పార్టీ అపార్థం చేసుకుంటున్నదని, తమ బహిష్కరణ నిర్ణయంపై పార్టీ మళ్ళీ ఆలోచించుకోవాలని ఆయన కోరారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు విపక్షాలు ఈ భవనంలోకి అడుగు పెట్టవా అని ప్రశ్నించారు. పార్లమెంట్ బీజేపీకి మాత్రమే చెందినది కాదని, దేశానికంతటికీ చెందినదని ప్రమోద్ ఆచార్య స్పష్టం చేశారు. అయితే tయూపీకి చెందిన ఈయన ఆధ్యాత్మిక గురువుగా కూడా వ్యవహరిస్తున్నారు. ఇక కొత్త పార్లమెంట్ ఓపెనింగ్ వ్యవహారం రాజ్యాంగ వ్యవస్థలో రాష్ట్రపతి, ప్రధాని వహించే పాత్రలపై చర్చకు దారి తీసింది. కాంగ్రెస్ సహా 20 పార్టీలు దీనిపై తమ పంతం వీడటం లేదు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ కొత్త భవనాన్ని ప్రారంభించాలి గానీ ప్రధాని కాదని ఆ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి.

ఈ నెల 28న జరిగే పార్లమెంట్ నూతన భవన ప్రారంభోత్సవానికి 25 పార్టీలు హాజరు కావచ్చని తెలుస్తోంది. అందులో షిండే వర్గానికి చెందిన శివసేన, అప్నా దళ్, అస్సాం గణ పరిషద్, మిజో నేషనల్ ఫ్రంట్, నేషనల్ పీపుల్స్ పార్టీ, ఏఐఏడీఎంకే, సిక్కిం క్రాంతికారి మోర్చా, తమిళ మానిల కాంగ్రెస్, బోడో పీపుల్స్ పార్టీ, పత్తాలి మక్కల్ కచ్చి, మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీ వంటి ఎన్డీయేలోని పార్టీలన్నీ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాయి. ఎన్డీయేతర పార్టీలైన లోక్ జనశక్తి పార్టీ, బిజూజనతాదళ్, బీఎస్పీ, టీడీపీ, వైఎస్సార్సీపీ, అకాలీదళ్, జేడీ-ఎస్ కూడా సుముఖంగా ఉన్నాయి.

మరోవైపు కొత్త పార్లమెంట్‌ భవనాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ప్రారంభించేలా కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని శుక్రవారం సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ప్రధాని మోదీకి బదులుగా రాష్ట్రపతి ముర్ము పార్లమెంట్‌ భవనాన్ని ప్రారంభించాలని ఆదేశించేందుకు కోర్టు నిరాకరించింది. ఓ న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరించింది. నూతన పార్లమెంట్‌ భవనాన్ని రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రారంభించేలా ఆదేశాలివ్వాలని కోరుతూ గురువారం రోజున సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు వేశారు. కొత్త పార్లమెంట్‌ భవన ప్రారంభోత్సవానికి రాష్ట్రపతిని ఆహ్వానించకుండా లోక్‌సభ సచివాలయం రాజ్యాంగాన్ని ఉల్లంఘించిందని తన పిటిషన్లో పేర్కొన్నారు. అయితే ఆ పిల్ ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here