రష్యా క్షిపణి దాడుల తర్వాత ఉక్రెయిన్లో దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. ఎంతలా అంటే ఓ చిన్నారికి ఉక్రేనియన్ వైద్యులు చీకట్లో గుండె చికిత్స చేయాల్సిన పరిస్థితి నెలకొంది. రష్యా క్షిపణులు రాజధాని నగరంలో విద్యుత్ లేకుండా చేయడంతో ఉక్రేనియన్ వైద్యుల బృందం కీవ్లోని ఓ ఆస్పత్రిలో చీకట్లోనే చిన్నారి గుండె శస్త్రచికిత్స చేసిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
“ఉక్రెయిన్పై రష్యన్లు చేసిన క్షిపణి దాడి సమయంలో, కీవ్లోని హార్ట్ ఇన్స్టిట్యూట్లో విద్యుత్తు నిలిపివేయబడింది. ఈ సమయంలో సర్జన్లు చిన్నారికి అత్యవసర గుండె శస్త్రచికిత్స చేస్తున్నారు” అని సోషల్ మీడియా యూజర్ ఇరినా వోయిచుక్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఫుటేజీలో శస్త్రవైద్యుల బృందం బ్యాటరీ లైట్తో ఆపరేషన్ను కొనసాగిస్తున్నట్లు చూపించింది. సర్జన్ల హెడ్ల్యాంప్లు కాకుండా, చీకటి గదిని కప్పేసింది. వందలాది మంది ట్విట్టర్ వినియోగదారులు వైద్యులను హీరోలుగా ప్రశంసించారు. “ఈ సర్జన్లు హీరోలు!!! గొప్ప హృదయాన్ని కలిగి ఉన్నారు” అంటూ ప్రశంసల వర్షం కురిపించారు.
ఇంతలో, రష్యా బుధవారం కీవ్, అనేక ఇతర ఉక్రేనియన్ నగరాలపై సుమారు 70 క్షిపణులను ప్రయోగించిన తరువాత ఈ సంఘటన జరిగింది, దీనివల్ల దేశంలోని అణు విద్యుత్ ప్లాంట్లు 40 సంవత్సరాలలో మొదటిసారిగా పవర్ గ్రిడ్ నుంచి డిస్కనెక్ట్ అయినట్లు న్యూయార్క్ పోస్ట్ నివేదించింది. దక్షిణ ఉక్రేనియన్ నగరమైన ఖేర్సన్పై రష్యా బాంబు దాడుల్లో శుక్రవారం 15 మంది పౌరులు మరణించారని అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా ఇంజినీర్లు ప్రధాన నగరాలకు విద్యుత్, నీటి సరఫరాను పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తు్న్నారు. ఉక్రెయిన్లో ఉష్ణోగ్రతలు గడ్డకట్టే స్థాయికి చేరుకోవడంతో పాటు ఆరోగ్య సంక్షోభం, వలసలు భయాలను రేకెత్తిస్తుండగా.. ఈ దాడులు ఉక్రెయిన్ను ఆందోళనలోకి నెట్టేస్తున్నాయి. ఉక్రెయిన్లోని మౌలిక సదుపాయాలపై లక్ష్యంగా చేసుకుని రష్యా దాడుల వల్ల దేశంలోని ఆరు మిలియన్ల కుటుంబాలు ఇప్పటికీ విద్యుత్ కోతల కారణంగా ప్రభావితమయ్యాయని ఆ దేశ అధ్యక్షుడు వొలొడిమిర్ జెలెన్స్కీ అన్నారు.