ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం గోధుమ సంక్షోభం నెలకొంది. గోధుమను ఎక్కువగా పండించే రష్యా, ఉక్రెయిన్ లు యుద్ధంలో ఉండటంతో గోధుమ కొరత ఏర్పడింది.
ప్రపంచంలోనే గొధుమలను ఎక్కువగా పండించే రెండో దేశంగా భారత్ ఉంది. అయితే భారత్ కూడా తన దేశ అవసరాల నిమిత్తం ఇటీవల గోధుమల ఎగుమతులను బ్యాన్ చేసింది. దీనిపై ఈయూ దేశాలు తీవ్ర అభ్యంతరం కూడా తెలిపాయి. భారత దేశంలో ఆహార భద్రత కోసమే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే క్రెడిట్ లెటర్స్, ఆహార భద్రత కోసం కొన్ని దేశాలకు మినహా అన్ని దేశాలకు ఇండియా గోధుమలను బ్యాన్ చేసింది.
కాగా ఇండియా నుంచి దిగుమతి అయ్యే గోధుమలను మళ్లీ ఇతర దేశాలకు ఎగుమతి చేయకుండా 4 నెలల పాటు ఎగుమతులపై యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ బ్యాన్ విధించింది. అంటే ఇండియా నుంచి వచ్చే గోధుమలను మళ్లీ యూఏఈ నుంచి ఏ ఇతర దేశానికి కూడా ఎగుమతి చేయకూడదని అక్కడి ప్రభుత్వం నిషేధం విధించింది. ప్రపంచ వ్యాప్తంగా సప్లై చైన్ ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో యూఏఈ గవర్నమెంట్ ఈ నిర్ణయం తీసుకుంది. కాగా దేశీయ అవసరాల కోసం యూఏఈకి గోధుమలు ఎగుమతి చేయడానికి భారత్ అంగీకరించిందని అక్కడి ప్రభుత్వం తెలిపింది.
మే 14న భారత దేశంలో గోధుమల ఎగుమతులను నిషేధించింది. అయితే క్రెడిట్ లైన్స్, కొన్ని దేశాలకు మాత్రమే గోధుమలను ఎగుమతి చేస్తోంది. అప్పటి నుంచి దాదాపుగా 4,69,202 టన్నుల గోధుమల రవాణా చేయడానికి ఇండియా అనుమతించింది. భారత్ నుంచి యూఏఈకి వచ్చిన గోధుమలను తిరిగి ఎగుమతి చేయాలనుకునే కంపెనీలు ముందుగా ఆర్థిక మంత్రిత్వ శాఖకు దరఖాస్తు చేసుకోవాలని యూఏఈ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. యూఏఈ, ఇండియా ఫిబ్రవరిలో విస్తృత వాణిజ్యం, పెట్టుబడి ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఇది ఒక దేశం వస్తువులపై మరో దేశం సుంకాలను తగ్గించుకోవాలని, ఐదు ఏళ్లలో వార్షిక వాణిజ్యాన్ని 100 బిలియన్ డాలర్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి.