More

    ఐపీఎల్ లోకి మరో రెండు జట్లు.. ఏయే నగరాలంటే..!

    ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లోకి కొత్తగా రెండు కొత్త జట్లు వచ్చేశాయి. వచ్చే సీజన్ లో కొత్తగా అహ్మదాబాద్, లక్నో జట్లు కూడా పాల్గొంటాయని బీసీసీఐ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ రెండు కొత్త ఫ్రాంచైజీల చేరికతో ఐపీఎల్ లో జట్ల సంఖ్య 10కి పెరిగింది. రెండు కొత్త జట్ల కోసం నిర్వహించిన బిడ్డింగ్ లో అహ్మదాబాద్ జట్టును సీవీసీ క్యాపిటల్ పార్టనర్స్ సంస్థ సొంతం చేసుకోగా.. లక్నో జట్టును ఆర్పీజీ గ్రూప్ దక్కించుకుంది. లక్నో ఫ్రాంచైజీ కోసం ఆర్పీజీ గ్రూప్ అధినేత సంజీవ్ గోయెంకా రూ.7 వేల కోట్లకు బిడ్ వేశారు. అహ్మదాబాద్ జట్టు కోసం సీవీసీ క్యాపిటల్ సంస్థ రూ.5 వేల కోట్లకు బిడ్ దాఖలు చేసింది.

    లక్నో జట్టును ఆర్పీ- సంజీవ్‌ గోయెంకా గ్రూప్‌ రూ. 7090 కోట్లకు దక్కించుకోగా, అహ్మదాబాద్‌ కోసం ఐరిలియా కంపెనీ (సీవీసీ క్యాపిటల్‌) రూ. 5,600 కోట్ల బిడ్ వేసింది. బీసీసీఐకి ఈ బిడ్‌ల ద్వారా రూ. 12,715 కోట్ల ఆదాయం సమకూరింది. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ మాట్లాడుతూ ‘ఐపీఎల్‌ మరో రెండు కొత్త నగరాలకు చేరనుంది. వచ్చే సీజన్‌ నుంచి లక్నో, అహ్మదాబాద్‌ మెగాలీగ్‌లో భాగం కానున్నాయి. బిడ్‌లకు మంచి స్పందన వచ్చింది. భారత క్రికెట్ పురోగమిస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. అదే మాకు ముఖ్యం. మేము భారత క్రికెట్‌ని డెవలప్ చేసేందుకే ప్రయత్నిస్తాం. అది మా పని. భారత క్రికెట్‌ ఎంత గొప్పగా ఉంటే అంత మంచిది’ అని తెలిపాడు. ‘ఐపీఎల్‌లోకి తిరిగి రావడం ఆనందంగా ఉంది. ఇది తొలి అడుగు మాత్రమే. మంచి జట్టును ఎంపిక చేయడంతో పాటు లీగ్‌పై మాదైన ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తాం.. జట్టును దక్కించుకోడానికి మా టీమ్ పెద్ద కృషి చేసింది అన్నారు’ అని సంజీవ్‌ గోయెంక పేర్కొన్నారు. గతంలో గోయెంక రైజింగ్‌ పుణే జట్టును కొనుగోలు చేశారు. వచ్చే ఏడాది భారత్‌లోనే ఐపీఎల్‌ నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది. 10 జట్లతో 74 మ్యాచ్‌లు నిర్వహించనున్నారు.

    సంజీవ్ గోయెంకా గ్రూప్ (RPSG) ఐపీఎల్ లో పునరాగమనం చేసింది. ఈ గ్రూప్ 2017 వరకు పూణే సూపర్‌జైంట్ జట్టును కలిగి ఉంది. మరోవైపు CVC క్యాపిటల్ గ్రూపు మొదటిసారిగా ప్రపంచంలోనే అతిపెద్ద లీగ్‌లోకి ప్రవేశించింది. CVC క్యాపిటల్ భాగస్వాములు ఒక ప్రైవేట్ ఈక్విటీ, పెట్టుబడి సలహా సంస్థ. ఇది 40 ఏళ్ల క్రితం 1981లో ప్రారంభమైంది. ఈ సంస్థ ప్రధాన కార్యాలయం లక్సెంబర్గ్‌లో ఉంది. ప్రధాన కార్యాలయం లండన్‌లో ఉంది. CVC క్యాపిటల్ పార్ట్నర్స్ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా 73 కంపెనీలలో పెట్టుబడులు పెట్టింది. గత 40 సంవత్సరాలలో ఈ కంపెనీ ఇప్పటివరకు 5 లక్షల కోట్లకు పైగా పెట్టుబడి పెట్టింది. ఈ కంపెనీ అమెరికా, యూరప్, ఆసియాలో ప్రతిచోటా పెట్టుబడి పెట్టింది. CVC క్యాపిటల్ నికర విలువ రూ. 56 వేల కోట్ల కంటే ఎక్కువ. ప్రపంచవ్యాప్తంగా 3 లక్షల మందికి పైగా దీని కోసం పనిచేస్తున్నారు. స్పానిష్ ఫుట్‌బాల్ లీగ్ లా లిగాలో కూడా ఈ కంపెనీ కొంత వాటాను కలిగి ఉంది. CVC క్యాపిటల్ పార్టనర్స్ 2006 నుంచి 2017 వరకు ఫార్ములా వన్ యజమానిగా కూడా ఉన్నారు.

    Related Stories