తిరుమల లడ్డూ బరువు వివాదంపై వివరణ ఇచ్చిన టీటీడీ

0
746

తిరుమల లడ్డూ ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే తాజాగా టీటీడీ తిరుమల లడ్డూ బరువు తగ్గించేసిందనే ఆరోపణలు వచ్చాయి. వైరల్ అవుతున్న ఓ వీడియోలో తిరుమలలోని లడ్డూ కౌంటర్ వద్ద భక్తుడికి, కౌంటర్ సిబ్బందికి మధ్య లడ్డూల బరువు విషయమై వాదోపవాదాలు జరిగాయి. లడ్డూలు చిన్నవిగా ఉన్నాయని.. కౌంటర్ లో ఉన్న ఉద్యోగి ఓ లడ్డూను వెయింగ్ మెషీన్ పై ఉంచగా, అది 90 గ్రాములు తూగినట్టు కనిపించింది. దాంతో ఆ భక్తుడు ఇది చీటింగ్ అని మండిపడ్డాడు. వైఎస్ జగన్, వైవీ సుబ్బారెడ్డి కలిసి చేస్తున్న మోసం అని ఆరోపించాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. తెలుగుదేశం పార్టీ కూడా విమర్శనాస్త్రాలు సంధించింది. దొంగలకు అధికారం ఇవ్వడం అంటే దోపిడీకి అనుమతి ఇచ్చినట్టేనని జగన్ అండ్ కో నిరూపిస్తోందని టీడీపీ విమర్శించింది. పరమ పవిత్రమైన తిరుపతి లడ్డూలోనూ వారు దోపిడీని వెదుక్కోవడం దారుణం అని పేర్కొంది. 175 గ్రాములు ఉండాల్సిన తిరుపతి లడ్డూ బరువు ఎంత తూగిందో మీరే చూడండి అంటూ టీడీపీ ఓ వీడియోను పంచుకుంది.

ఈ వివాదంపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) స్పందించింది. వెయింగ్ మెషీన్ లో సాంకేతిక సమస్య ఏర్పడిందని, దాంతో మైనస్ 70 అని ఉండడం, దానికితోడు కాంట్రాక్టు సిబ్బంది అవగాహనా లోపంతో లడ్డూ బరువుపై భక్తులు అపోహలకు లోనయ్యారని వివరించింది. సాధారణంగా లడ్డూ కౌంటర్ల వద్ద ఇబ్బందులు ఎదురైతే అక్కడే ఉండే కౌంటర్ అధికారికి తెలియజేస్తే సమస్య పరిష్కారం అయ్యే వ్యవస్థ టీటీడీలో ఉందని.. కానీ ఆ భక్తుడు ఇవేవీ చేయకుండా తమపై ఆరోపణలు చేశాడని, ఇలాంటి ఆరోపణలు చేయడం విచారకరం అని టీటీడీ వెల్లడించింది. శ్రీవారి లడ్డూ 160 నుంచి 180 గ్రాముల బరువు ఉంటుందని, ఇందులో ఎలాంటి సందేహాలకు తావులేదని టీటీడీ పేర్కొంది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని భక్తులు నమ్మవద్దని విజ్ఞప్తి చేసింది. పోటులో తయారుచేసే లడ్డూ ప్రసాదాల బరువును తప్పనిసరిగా అధికారులు తనిఖీ చేస్తారని టీటీడీ వివరించింది.