తిరుమల కొండపై భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 25 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. దీంతో భక్తులు క్యూలైన్స్ లో బారులు తీరారు. స్వామివారి ఉచిత దర్శనానికి సుమారు 15 గంటల సమయం పడుతోంది. రూ.300 ల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది. 16వ తేదీ ఆదివారం రోజున 84,794 మంది శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారికి 35,560 మంది భక్తులు తమ తలనీలాలు సమర్పించారు. భక్తులు హుండీ స్వామి వారికి ద్వారా 4.67 కోట్ల రూపాయలను కానుకలుగా సమర్పించారు.
భక్తులు భారీ సంఖ్యలో ఉండడంతో ప్రతి సోమవారం నిర్వహించే చతుర్దశ కలశ విశేష పూజను టీటీడీ రద్దు చేసింది. విగ్రహాల పరిరక్షణలో భాగంగా ఆగమ సలహాదారుల సూచనల మేరకు టీటీడీ నిర్ణయం తీసుకుంది. సర్వదర్శనం నిలుపుదల చేసిన అనంతరం అర్చకులు శ్రీవారికి రాత్రి కైంకర్యాలు ప్రారంభిస్తారు. ఈ కైంకర్యాల్లో భాగంగా రాత్రి తోమాల, అర్చన, రాత్రి గంట, తిరువీసం, ఘంటాబలి నిర్వహిస్తారు.