తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-4 ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. మొత్తం 8,180 ఉద్యోగాల కోసం 9,51,321 మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెల్లడించింది. సగటున ఒక్కో పోస్టుకు 117 మంది చొప్పున పోటీ పడుతున్నారు. టీఎస్పీఎస్సీ ఇప్పటి వరకు విడుదల చేసిన నోటిఫికేషన్లకు ఈ స్థాయిలో దరఖాస్తులు రావడం ఇది రెండోసారి. 2018లో 700 వీఆర్వో పోస్టుల భర్తీకీ రికార్డు స్థాయిలో 10.58లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు.
గ్రూప్-4 నోటిఫికేషన్ డిసెంబర్ 1న విడుదలైంది. తొలుత 9,168 పోస్టులను భర్తీ చేయనున్నట్లు టీఎస్పీఎస్సీ తెలిపింది. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్ 23న ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. కొన్ని సాంకేతిక కారణాల వల్ల దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్ 30న ప్రారంభించారు. సమగ్ర నోటిఫికేషన్లో పోస్టుల సంఖ్య 8,039 మాత్రమేనని చెప్పారు. ముఖ్యంగా పంచాయితీ రాజ్ విభాగంలో 1129 పోస్టులు తగ్గాయి. మహాత్మా జ్యోతిబాపూలే తెలంగాణ బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీల్లో 141 జూనియర్ అసిస్టెంట్స్ ఖాళీలను గ్రూప్-4 లో చేర్చుతున్నట్లు ప్రకటించింది. దీంతో గ్రూప్-4 కింద 8,180 పోస్టులను భర్తీ చేయనున్నారు.
పరీక్ష ఎప్పుడంటే:
జూలై 1న గ్రూప్-4 పరీక్ష
ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు పేపర్ 1,
మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్ 2
రెండు పేపర్లలోనూ 150 చొప్పున ప్రశ్నలు
ప్రతి ప్రశ్నకు ఒక్కొ మార్కు చొప్పున రెండు పేపర్లూ కలిపి 300 మార్కులకు పరీక్ష
ఆబ్జెక్టివ్ పద్ధతిలో పరీక్ష
పరీక్షను ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ మాధ్యమాల్లో నిర్వహణ