పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ మద్దతుదారుల దాడులు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమ పార్టీకి వ్యతిరేకంగా ఉన్న నాయకులపై దాడులు చేస్తూనే ఉన్నారు. బీజేపీ నాయకుల మీద కూడా దాడులకు తెగబడుతూనే ఉన్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పోటీ చేస్తున్న భవానీపూర్లో బీజేపీ నేత దిలీప్ఘోష్పై టీఎంసీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా దిలీప్ ఘోష్ భవానీపూర్ నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ టీఎంసీ కార్యకర్తలు దూసుకొచ్చారు. టీఎంసీ కార్యకర్తలు దూసుకొస్తుండడంతో అప్రమత్తమైన ఘోష్ భద్రతా సిబ్బంది దాడి జరగకుండా అడ్డుకున్నారు. ఈ సందర్భంగా గుంపును చెదరగొట్టేందుకు ఘోష్ భద్రతా సిబ్బంది తుపాకులు బయటకు తీసి గాల్లోకి ఎక్కుపెట్టారు. బీజేపీ నేత దిలీప్ ఘోష్పై దాడి ఆరోపణలపై ఎన్నికల సంఘం స్పందించింది. దీనిపై నివేదిక ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడైన దిలీప్ ఘోష్పై దాడి చేయడాన్ని బీజేపీ ఖండిస్తోంది. దాడి సమయంలో దిలీప్ ఘోష్పై తృణమూల్ మద్దతుదారులు భౌతికంగా దాడి చేశారు. భద్రతా సిబ్బంది వారిని ఎట్టకేలకు ఆపింది. జగుబాబర్ బజార్ సమీపంలో ఈ సంఘటన జరిగినట్లు సమాచారం. ఆటోలో తృణమూల్ మద్దతుదారుల బృందం దిలీప్ ఘోష్ని అనుసరించింది. దిలీప్ ఘోష్ కు బీజేపీకి వ్యతిరేక నినాదాలు చేస్తూ ఘర్షణకు దిగింది. ఘర్షణను నివారించడానికి దిలీప్ ఘోష్ కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్లోకి ప్రవేశించారు. అయితే టీఎంసీ మద్దతుదారులు అతడిని అనుసరించి టీకా కేంద్రం నుంచి బయటకు లాగడంతో పాటు అతడిపై శారీరకంగా దాడి చేశారు. టీఎంసీ మద్దతుదారుల నుండి ‘జాయ్ బంగ్లా’ రాగా.. బీజేపీ కార్యకర్తలు ‘జై శ్రీ రామ్’ నినాదాలు చేశారు. హరీష్ ముఖర్జీ రోడ్డు వైపు ర్యాలీతో ఘోష్ ముందుకు వెళ్లినప్పుడు, తృణమూల్ మద్దతుదారులు బీజేపీకి చెందిన వ్యక్తిని పట్టుకుని తీవ్రంగా గాయపరిచారు. అతడిని బీజేపీ నాయకులు ఆసుపత్రికి తరలించారు.
దిలీప్ ఘోష్ ఈ సంఘటనపై ట్విట్టర్ లో పోస్టు చేశారు. పశ్చిమ బెంగాల్లో ప్రజా ప్రతినిధుల భద్రత గురించి ఆందోళన వ్యక్తం చేశారు. తనపై దాడి ఘటన ప్లాన్ ప్రకారం జరిగిందని ఆయన అన్నారు. ప్రజా ప్రతినిధులకే ఇలా ఉంటే.. సాధారణ ప్రజల భద్రత గురించి ఆందోళన తమకు ఉంటుందని ఆయన అన్నారు.