బెంగాల్ రాష్ట్రంలో ఎన్నికల తర్వాత చోటు చేసుకున్న హింసాత్మక ఘటనల గురించి దేశం మొత్తం చర్చించింది. భారతీయ జనతా పార్టీ మద్దతుదారులపై తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు విరుచుకుపడ్డారు. ఎంతో మంది గ్రామాలను వదిలేసి వేరే ప్రాంతాల లోకి వెళ్లిపోయారు. ఇళ్లలోకి దూరి మరీ దాడులు చేసిన ఘటనలు ఎన్నో..! ఇంత హింస జరుగుతున్నా కూడా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కానీ.. ఆ రాష్ట్ర పోలీసులు కానీ ఆపడానికి చర్యలు తీసుకోలేదు. మే 2న ఫలితాలు రాగానే తృణమూల్ నేతలు బీజేపీ మద్దతుదారులను, కార్యకర్తలను హింసించడం మొదలు పెట్టారు. సొంత ఇళ్లను, గ్రామాలను వదిలిపెట్టి ఎన్నో కుటుంబాలు వెళ్లిపోయాయి. కొందరు వ్యక్తులు తిరిగి సొంత గ్రామాలకు చేరుకోవాలని అనుకుంటూ ఉన్నారు. అయితే అందుకు తృణమూల్ కాంగ్రెస్ నేతలు ఒప్పుకోవడం లేదు. పక్కనే ఉన్న అస్సాంలో తలదాచుకుంటూ ఉన్నారు. ఓ వ్యక్తి సొంత గ్రామానికి రావాలని అనుకుని సదరు తృణమూల్ కాంగ్రెస్ నేతను అడగ్గా.. నువ్వు ఊర్లోకి రావాలనుకుంటే మొదట నీ భార్యను నా దగ్గరకు పంపు అంటూ అసహ్యంగా మాట్లాడాడు. ఈ విషయాన్ని బాధితులు బయట పెట్టారు.
ఈ షాకింగ్ ఘటన బయటకు రావడంతో తృణమూల్ కాంగ్రెస్ చేస్తున్న దారుణాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉన్నాయి. తృణమూల్ నేత ముజఫిర్ బైగ్ బీజేపీ నేత సధాన్ బాజ్ ను గ్రామంలో అడుగుపెట్టాలంటే నీ భార్య పింకీని నా దగ్గరకు పంపించు..! ఆ తర్వాతనే గ్రామంలో అడుగుపెట్టనిస్తాను అంటూ బెదిరింపులకు దిగాడు. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని మీనాఖాన్ అసెంబ్లీ నియోజకవర్గంలోని గ్రామంలో ఉంటున్న బీజేపీ నేత సధాన్ బాజ్ భార్య గురించి ఎంతో అసహ్యంగా మాట్లాడాడు తృణమూల్ కాంగ్రెస్ నేత. ‘కొద్దిరోజులు నీ భార్య పింకీని నా దగ్గరకు పంపు.. ఆ తర్వాతనే నిన్ను గ్రామంలోకి అడుగుపెట్టనిస్తాను’ అంటూ బెదిరింపులకు దిగాడు ముజఫిర్ బైగ్. ఓ వీడియోను బీజేపీ నేత దేవదత్త మాజి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. ఆ వీడియోలో ముజఫిర్ బైగ్ తమను ఎలా బెదిరించాడో సధాన్ బాజ్, అతడి భార్య పింకీ చెప్పుకున్నారు. పింకీ విమెన్స్ వింగ్ కు ట్రెజరర్ గా ఉన్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే ఎంతో మంది హిందువులు ఆ ప్రాంతాన్ని విడిచి పెట్టి అస్సాంలో తలదాచుకుంటూ ఉన్నారు.
మీనాఖాన్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎంతో మంది హిందువులను హింసించారని.. ఆ హింసను తట్టుకోలేక తామంతా పారిపోయి వచ్చామని పింకీ తెలిపింది. తృణమూల్ కాంగ్రెస్ గూండాలు ఇళ్లల్లోకి చొరబడడమే కాకుండా మొత్తం దోచుకున్నారని పింకీ తెలిపింది. ఎన్నికల ఫలితాలు రాగానే వారంతా ఒక్కసారిగా తమ మీద పడ్డారని ఏమి చేయాలో తెలియని పరిస్థితుల్లో ఒంటి మీద బట్టలతో తాము పారిపోయామని పింకీ చెప్పుకొచ్చింది. తిరిగి ఇంటికి వెళ్లాలని అనుకుని ముజఫిర్ బైగ్ ను తన భర్త సంప్రదించగా.. నీ భార్యను పంపు అంటూ ఇష్టమొచ్చినట్లు మాట్లాడాడని పింకీ వెల్లడించింది. మమ్మల్ని భారత ప్రధాని నరేంద్ర మోదీనే కాపాడాలని ఆమె కోరింది. ఇకనైనా తమకు వేధింపులు ఉండకుండా చూడాలని కోరింది.
బెంగాల్ హింసపై సర్వత్రా ఆగ్రహం
ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే బెంగాల్ లో పెద్ద ఎత్తున హింస చెలరేగింది. ఈ హింసలపై దేశవ్యాప్తంగా ఉన్న మహిళ న్యాయవాదులు స్పందించారు. ఇలాంటీ సంఘటనలు పునారావృతం కాకుండా భాద్యులపై చర్యలు చేపట్టాలని కోరుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు మహిళా న్యాయవాదులు ఓ లేఖ రాశారు. బెంగాల్ ఎన్నికల అనంతరం జరిగిన హింసపై కమిటీ వేయాలని కోరుతూ 2,093 మంది మహిళా న్యాయవాదులు సీజేఐకి లేఖ అందించారు. చిన్నారులు, మహిళలు, ఎస్సీలపై దాడి జరిగిందని లేఖలో వివరించారు. పశ్చిమ బెంగాల్ డీజీపీకి జాతీయ మహిళా కమిషన్ సమన్లు జారీ చేసింది. మే 31వ తేదీన హాజరుకావాలంటూ తన నోటీసుల్లో పేర్కొంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న హింస గురించి మహిళా కమిషన్ సీరియస్గా ఉంది. తాము ఫార్వర్డ్ చేసిన ఫిర్యాదులపై డీజీపీ ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలుసుకోనున్నట్లు మహిళా కమిషన్ తెలిపింది. జిల్లాల వారిగా మహిళల పట్ల జరుగుతున్న నేరాల వివరాలను కూడా మహిళా కమిషన్ కోరింది. ఏప్రిల్ 21వ తేదీ తర్వాత నమోదు అయిన ఎఫ్ఐఆర్ల వివరాలను తమ ముందు ఉంచాలని తెలిపింది. ఈనెల ఆరంభంలో జాతీయ మహిళ కమిషన్కు చెందిన ముగ్గురు సభ్యుల బృందం బెంగాల్లో పర్యటించి.. రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధన్కర్ను కూడా కలిసింది.