పెగాసస్ వ్యవహారంపై పార్లమెంట్ దద్దరిల్లుతోన్న సంగతి తెలిసిందే..! నిజా నిజాలు తెలుసుకోకుండానే ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తూ ఉన్నాయని అధికారపక్షం చెబుతూ ఉంది. కొందరు నాయకులు అతిగా కూడా ప్రవర్తించారు. వారిలో టీఎంసీ ఎంపీ శంతను సేన్ కూడా ఉన్నారు. నేడు ఎంపీ శంతను సేన్పై రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు సస్పెన్షన్ వేటు వేశారు. రాజ్యసభలో ఐటీ, కమ్యూనికేషన్ల మంత్రి అశ్విని వైష్ణవ్ పెగాసస్ స్పైవేర్పై ప్రకటనను చదివి వినిపిస్తుండగా విపక్ష సభ్యులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో టీఎంసీ సభ్యుడు శంతను సేన్ వైష్ణవ్ చేతిలో నుంచి పలు పత్రాలను లాక్కొని చింపి వాటిని రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ వైపుగా విసిరేశారు. ఈ రోజు ఆయన తీరుపై రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం తరఫున పార్లమెంటరీ వ్యవహారాల సహాయమంత్రి వి.మురళీధరన్ సస్పెన్షన్ కోసం తీర్మానం ప్రవేశపెట్టారు. దీంతో వెంకయ్య నాయుడు ఈ తీర్మానాన్ని మూజువాణి ఓటు ద్వారా ఆమోదిస్తూ శంతను సేన్పై సస్పెన్షన్ వేటు వేశారు. వర్షాకాల సమావేశాలు పూర్తయ్యే వరకు సేన్ను సస్పెండ్ చేశారు. సభ నుంచి బయటకు వెళ్లాలని శంతను సేన్కు వెంకయ్య సూచించారు. దీంతో టీఎంసీ సభ్యులు అభ్యంతరాలు తెలుపుతూ ఆందోళనకు దిగారు. దీంతో కొద్ది సేపు సభ వాయిదా పడింది. సభ మళ్లీ ప్రారంభం అయ్యాక కూడా ఎంపీ శంతను సేన్ బయటకు వెళ్లకుండా సీట్లోనే ఉండిపోయారు. దీంతో సభ నుంచి బయటకు వెళ్లాలని డిప్యూటీ చైర్మన్ హరివంశ్ కోరారు. అనంతరం మళ్లీ రాజ్యసభ వాయిదా పడింది.
శంతను సేన్ తీరుపై ఐటీ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ స్పందించారు. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసి) “హింస సంస్కృతిని” పార్లమెంటుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది అశ్విని వైష్ణవ్ విరుచుకుపడ్డారు. తీఎంసికి బెంగాల్లో హింసాత్మక సంస్కృతి ఉంది. అదే సంస్కృతిని వారు పార్లమెంటుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. తరువాతి తరం పార్లమెంటు సభ్యులకు వారు ఏ సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? అని ఆయన ప్రశ్నించారు.