తిరుమలలో శ్రీవారి దర్శనానికి విపరీతమైన రద్దీ నెలకొంది. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం రద్దీ తగ్గే వరకు వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది. టీటీడీ ఈవో ధర్మారెడ్డి మాట్లాడుతూ.. రద్దీ తగ్గేంత వరకు వీఐపీలు, భక్తులు తిరుపతి పర్యటనను వాయిదా వేసుకోవాలని కోరారు. అధికారులతో కలిసి భక్తుల క్యూలను తనిఖీ చేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం రద్దీ విపరీతంగా ఉందని, గంటకు 4,500 మందిని మాత్రమే దర్శనం చేయించగలమని చెప్పారు. కాబట్టి భక్తులు ఈ విషయాన్ని గుర్తించి తమ పర్యటనను వాయిదా వేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమలకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. విపరీతమైన రద్దీ నెలకొంది. సర్వదర్శనం భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లు, నారాయణగిరి ఉద్యానవనంలోని షెడ్లు నిండిపోయాయి.