సినీనటుడు, ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు కార్యాలయంలో దొంగతనం చోటు చేసుకుంది. దాదాపు రూ. 5 లక్షల విలువ చేసే హెయిర్ డ్రెస్సింగ్ సామగ్రి చోరీకి గురైంది. హెయిర్ డ్రెస్సర్ అయిన నాగ శ్రీనుపై అనుమానం వ్యక్తం చేస్తూ మంచు విష్ణు మేనేజర్ సంజయ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చోరీ జరిగినప్పటి నుంచి నాగ శ్రీను కనిపించడం లేదని, దొంగతనం వెనక అతడు ఉండొచ్చని ఫిర్యాదులో ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఫిల్మ్నగర్లోని మూవీ అర్టిస్ట్ అసోసియేషన్(మా) కార్యాలయంలో విలువైన సామాగ్రి కనిపించడం లేదని మంచు విష్ణు మేనేజర్ సంజయ్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం బయటపడింది. మంచు విష్ణు ఆఫీసులో హెయిర్ డ్రెస్సింగ్ సామాగ్రిని ఎత్తుకెళ్లారని మేనేజర్ తెలిపాడు. దుండగులు అపహరించిన హెయిర్ డ్రెస్సింగ్ సామాగ్రి విలువ సుమారు రూ. 5లక్షల ఉంటుందని అంచనా వేస్తున్నారు.
ఇక కొద్దిరోజుల కిందట మంచు విష్ణు ట్రోలర్స్ కు షాకిచ్చే ప్రకటన చేసిన సంగతి తెలిసిందే..! ప్రముఖ నటుడు మోహన్ బాబు, మంచు విష్ణులను అపహాస్యం చేసే మీమ్స్ మరియు ట్రోల్లపై సీరియస్ యాక్షన్ తీసుకోనున్నారు. మోహన్ బాబు తాజా చిత్రం ‘సన్ ఆఫ్ ఇండియా’ డిజాస్టర్ గా మిగిలిన సంగతి తెలిసిందే. కొందరు పనిగట్టుకునే సినిమాను ఫ్లాప్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. తండ్రీకొడుకులను అవమానపరిచే కంటెంట్ను పోస్ట్ చేసినందుకు ట్రోలర్లు, మెమర్లు, యూట్యూబ్ ఛానెల్లు మరియు వివిధ సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లలో వ్యక్తిగత ఖాతాలు, హ్యాండిల్లకు లీగల్ నోటీసులు పంపబడుతున్నాయి. “మీ పోస్ట్లు, వ్యాఖ్యలు, చిత్రాలు మరియు వీడియోలు బాధించేవిగానూ, అవమానకరమైనవి గానూ ఉన్నాయి. అయినప్పటికీ మేము సంయమనం పాటించాం, కానీ మీ టార్గెట్ చాలా ఎక్కువైంది” అని ఓ ప్రకటనను ఇటీవలే విడుదల చేశారు. రూ. 10 కోట్ల మేరకు నష్టపరిహారాన్ని క్లెయిమ్ చేసే స్థాయికి వెళ్తామని నోటీసులో తెలిపారు. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ప్రొడక్షన్ హౌస్ నుండి నోటీసులు వచ్చాయి.