తెలంగాణలోని రెండు చారిత్రక కట్టడాలకు యునెస్కో ఆసియా-పసిఫిక్ అవార్డులు లభించాయి. కుతుబ్షాహీ సమాధుల ప్రాంగణంలో ఉన్న గోల్కొండ మెట్ల బావి, కామారెడ్డి జిల్లాలోని దోమకొండ కోట ఈ అవార్డులకు ఎంపికయ్యాయి. ఈ అవార్డుల కోసం మొత్తం 11 దేశాల నుంచి 50 చారిత్రక కట్టడాలకు సంబంధించిన దరఖాస్తులు రాగా, ఆరు దేశాలకు చెందిన 13 కట్టడాలకు ఐదు కేటగిరీల్లో అవార్డులకు ఎంపిక చేశారు. వీటిలో నాలుగు భారత్కు, మరో నాలుగు చైనాకు దక్కగా ఇరాన్కు రెండు, థాయ్లాండ్, ఆఫ్ఘనిస్థాన్, నేపాల్ దేశాలు ఒక్కోటి చొప్పున దక్కించుకున్నాయి.
గోల్కొండ మెట్లబావి ‘అవార్డ్ ఆఫ్ డిస్టింక్షన్’ కేటగిరీలో, దోమకొండ కోట ‘అవార్డ్ ఆఫ్ మెరిట్’ కేటగిరీలో చోటు సంపాదించుకున్నాయి. ముంబైలోని ‘ఛత్రపతి శివాజీ వస్తు సంగ్రహాలయ మ్యూజియం’కు ‘అవార్డ్ ఆఫ్ ఎక్స్లెన్స్’ లభించింది. దేశంలోనే తొలి రైల్వే స్టేషన్ అయిన ముంబైలోని బైకుల్లా స్టేషన్కు ‘అవార్డ్ ఆఫ్ మెరిట్’ లభించాయి. దోమకొండ కోటను 18వ శతాబ్దంలో కామినేని వంశస్తులు 39 ఎకరాల 20 గుంటల విస్తీర్ణంలో నిర్మించారు. ఈ కోట ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది. ఇందులో అద్దాల మేడ, రాజభవనం, అశ్వశాల, బుర్జుజులతోపాటు 4 శతాబ్దాల క్రితం నిర్మించిన మహదేవ ఆలయం కూడా ఉంది.