గోవుల అక్రమ రవాణా వ్యవహారంపై తెలంగాణ హై కోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది. సరైన పత్రాలు లేకుండా గోవులను తరలించడం నేరమని హై కోర్టు అభిప్రాయపడింది. చెక్ పోస్టుల్లో వాహనాలను పోలీసులతో పాటూ గోరక్షాదళ్ సభ్యులు కూడా తనిఖీ చేయవచ్చని తెలంగాణ హైకోర్టు తెలిపింది. గోవులను అక్రమంగా తరలిస్తూ ఉన్నారనే సమాచారం పోలీసులకు ఇవ్వాలని హై కోర్టు సూచించింది. పోలీసులు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా గోవులను తరలిస్తున్న వారిపై కేసులు నమోదు చేయాలని పోలీసు శాఖను ఆదేశించింది.
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కు ప్రతి రోజూ పెద్ద ఎత్తున గోవుల అక్రమ రవాణా కొనసాగుతూ ఉంది. ఇది తప్పు అని చెబుతున్న వారిపై దాడులు కూడా జరుగుతున్నాయి. ఎటువంటి పత్రాలు లేకుండా నగరానికి తరలిస్తూ ఉన్న వాళ్ళపై ఇకపై కఠిన చర్యలు తీసుకోనున్నారు. సరైన ధృవ పత్రాలు లేకుండా గోవులను నగరంలోకి తరలించేందుకు అనుమతి లేదని తాజాగా తెలంగాణ హై కోర్టు స్పష్టం చేసింది. పోలీసులతో పాటు గోరక్షాదళ్ కు చెందిన ఒక వ్యక్తి పోలీస్ చెక్ పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీలు చేసేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. సరైన ధృవ పత్రాలు లేకుండా పశువులను తరలిస్తున్న వాటిని సీజ్ చేయవచ్చునని కోర్టు తెలిపింది. పశువుల తరలింపుపై గో రక్షకులు పోలీసులకు సమాచారం ఇవ్వాలని చెప్పింది. ఫిర్యాదు వచ్చిన వెంటనే పోలీసులు.. పశువులను అక్రమంగా తరలిస్తున్న వారిపై దర్యాప్తు చేసి కేసులు నమోదు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఫిర్యాదు వచ్చిన వెంటనే పోలీసులు పశువులను అక్రమంగా తరలిస్తున్న వారిపై దర్యాప్తు చేసి కేసులు నమోదు చేయాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. హై కోర్టు తీర్పును హిందూ సంఘాలు, పలువురు నేతలు స్వాగతించారు.
ఈ తీర్పుపై రాజా సింగ్ మాట్లాడుతూ తెలంగాణ హై కోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తూ ఉన్నామని అన్నారు. గతంలో ఆవులు, ఎద్దులను తరలిస్తున్న వాహనాలకు సంబంధించిన సమాచారం తెలంగాణ పోలీసులకు అందిస్తే వారు కనీసం పట్టించుకున్న పాపాన పోయింది లేదని అన్నారు. తెలంగాణ పోలీసులు ఎంఐఎంకు గులాంగిరి చేస్తున్నారని అన్నారు. అక్రమంగా గోవులను తరలిస్తున్న వాహనాలను అడ్డుకున్న గోరక్షాదళ్ కార్యకర్తలపై తిరిగి కేసులు పెడుతూ వచ్చారని ఆరోపించారు. వాహనాలను ఆపిన గోరక్షాదళ్ సభ్యులపై పోలీసులు ప్రశ్నల వర్షం కురిపించడమే కాకుండా రౌడీ షీట్ కూడా ఓపెన్ చేశారని ఆయన విమర్శించారు. ఇలా ఎంతో మంది గోరక్షాదళ్ సభ్యులు పోలీసుల కేసులను ఎదుర్కొన్నారని అన్నారు. తాజాగా కోర్టు గొప్ప నిర్ణయం తీసుకుందని.. ఇకపై గోరక్షాదళ్ సభ్యులు వాహనాలను ఆపి, పోలీసులకు సమాచారం ఇవ్వొచ్చని రాజా సింగ్ ఒక వీడియోలో తెలిపారు.