తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉపాధ్యాయుల ఆస్తులపై కీలక ఉత్తర్వులు వచ్చాయి. విద్యా శాఖ పరిధిలో పనిచేసే ఉపాధ్యాయులు ప్రతి ఏటా ఆస్తుల వివరాలను ప్రకటించాలని ఆదేశించింది.
ఈమేరకు తెలంగాణ విద్యా శాఖ కీలక ఉత్తర్వులు వెలువరించింది. స్థిర, చరాస్తుల క్రయవిక్రయాలకు ముందస్తు అనుమతి తీసుకోవాలని తేల్చి చెప్పింది. ఓ ప్రధానోపాధ్యాయుడిపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు రావడంతో ప్రభుత్వం ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నల్గొండ జిల్లా చందంపేట మండలం గుంటిపల్లి ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మహమ్మద్ జావేద్ అలీ విధులకు హాజరుకాకుండా వ్యక్తిగత పనులపై నిమగ్నమయ్యాడని..రాజకీయ కార్యకలాపాలు,స్థిరాస్తి వ్యాపారాల, వక్ఫ్ బోర్డు సెటిల్మెంట్లలో ఉన్నారన్న ఆరోపణలు తీవ్ర స్థాయిలో వచ్చాయి. వీటిపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ జరిపింది. విచారణలో కీలక విషయాలు వెలుగు చూశాయి. జావేద్ అలీపై వచ్చిన ఆరోపణల్లో నిజం ఉన్నట్లు తేల్చారు.
శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని విద్యా శాఖకు సిఫార్సు చేసింది. దీనితోపాటు విద్యా శాఖ పరిధిలోని ఉద్యోగులందరికీ పక్కాగా ఉత్తర్వులు ఇవ్వాలని సూచించింది. గతేడాది ఏప్రిల్లో విజిలెన్స్ అధికారులు నివేదిక ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగులకు బయోమెట్రిక్ హాజరు ఉండాలని స్పష్టం చేసింది. సిబ్బంది ఏటా ఆస్తుల వివరాలు సమర్పించాలని..స్థిర, చరాస్తి క్రయవిక్రయాలకు ముందస్తు అనుమతి పొందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. దీంతో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సూచనలతో పాఠశాల విద్యా శాఖ కీలక ఉత్తర్వులు వచ్చాయి.