నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారించడాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు నిరసనలు చేపట్టాయి. తెలంగాణ రాష్ట్రంలో నేడు రాజ్భవన్ ముట్టడికి రాష్ట్ర కాంగ్రెస్ నేతలు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో రాజ్భవన్ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. వివిధ మార్గాల్లో రాజ్భవన్ ముట్టడించేందుకు కాంగ్రెస్ శ్రేణులు రాజ్భవన్కు వెలుతుండగా.. ఖైరతాబాద్ కూడలి వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఆందోనకారులు బైక్ను తగులబెట్టారు. ఆర్టీసీ బస్సు అద్దాలను ధ్వంసం చేశారు. పోలీసులు ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున బారీకేడ్లను ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ నేతలు వాటిని తోసుకుంటూ ముందుకు వెళ్లారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, జగ్గారెడ్డి, గీతారెడ్డి, భట్టి విక్రమార్క తదితరులు రాజ్భవన్ వైపు వెళ్ళడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో వారిని అడ్డుకున్న పోలీసులు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు పలువురు నేతలను అదుపులోకి తీసుకున్నారు.
రాజ్ భవన్ ముట్టడి కి చేరుకున్న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్,ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి ప్రయత్నించారు. ఖైరతాబాద్ చౌరస్తా నుండి ర్యాలీ గా రాజ్ భవన్ కి వెళ్లాలని జగ్గారెడ్డి భావించారు. రాజ్ భవన్ దగ్గర పోలీసులతో ఆయనకు వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు ఎంత చెప్పినా ఆయన వినకపోవడంతో అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలించారు.