న్యూజిలాండ్తో జరిగిన మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత జట్టు 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరిగిన చివరి మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించింది. టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ చేసింది. మార్టిన్ గప్టిల్ మినహా ఎవరూ పెద్దగా రాణించకపోవడంతో కివీస్ 73 పరుగుల భారీ తేడాతో ఓటమిని అందుకుని.. సిరీస్ లోని మూడు మ్యాచ్ లను ఓడిపోయింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ రెండు మార్పులతో బరిలోకి దిగింది. కేఎల్ రాహుల్, అశ్విన్కు విశ్రాంతి ఇచ్చి ఇషాన్ కిషన్ యుజ్వేంద్ర చాహల్కు తుది జట్టులో స్థానం కల్పించింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ భారత్ కు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. 21 బంతుల్లో 6 ఫోర్లతో 29 పరుగులు చేసిన ఇషాన్ కిషన్ శాంట్నర్ బౌలింగ్ లో అవుట్ అవ్వడంతో 69 పరుగుల వద్ద తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత శాంట్నర్ వెంటవెంటనే సూర్యకుమార్ యాదవ్ (0) పంత్ (4)ను వెనక్కి పంపాడు. దీంతో భారత్ స్కోరు కాస్తంత నెమ్మదించింది. రోహిత్ 31 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 56 పరుగులు చేసి సోదీ బౌలింగులో అతడికే క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. అయితే, ఆ తర్వాత క్రీజులో కుదురుకున్న శ్రేయాస్ అయ్యర్ (25), వెంకటేశ్ అయ్యర్ (20) రాణించడంతో భారత్ భారీ స్కోరు దిశగా పయనించింది. చివరల్లో హర్షల్ పటేల్ (18), దీపక్ చాహర్ (21) మెరుపులు మెరిపించడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది.
భారత్ నిర్దేశించిన 184 పరుగుల భారీ విజయ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్ టాపార్డర్ ను అక్షర్ పటేల్ కూల్చేశాడు. ఓపెనర్ మార్టిన్ గప్టిల్ ఒక్కడే బాగా ఆడాడు. 36 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో అర్ధ సెంచరీ (51) పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత టిమ్ సీఫర్ట్ చేసిన 17 పరుగులే జట్టులో అత్యధికం. చివర్లో లాకీ ఫెర్గ్యూసన్ 14 పరుగులు చేశాడు. రనౌట్ లు కూడా కివీస్ కొంప ముంచాయి. దీంతో 17.2 ఓవర్లలో 110 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ 3, హర్షల్ పటేల్ 2, దీపక్ చాహర్, యుజ్వేంద్ర చాహల్, వెంకటేశ్ అయ్యర్ చెరో వికెట్ తీసుకున్నారు. మూడు వికెట్లు తీసిన అక్షర్ పటేల్ కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది. రోహిత్ శర్మ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు లభించింది.