టీ20 ప్రపంచకప్లో పాక్ కు మద్దతుగా నిలిచినందుకు ఉద్యోగం నుంచి తొలగించబడిన ఉదయపూర్లోని నీర్జా మోడీ స్కూల్ మాజీ టీచర్ నఫీసా అటారీని రాజస్థాన్లోని ఉదయపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. మెసేజింగ్ యాప్ వాట్సాప్లో పాక్ కు అనుకూలంగా పోస్ట్ చేసినందుకు ఆమెపై ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 153 కింద కేసు నమోదైంది. ఆమె పోస్ట్కు సంబంధించిన స్క్రీన్షాట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ తర్వాత ఆమె పోస్ట్ను తొలగించింది. అరెస్టు తర్వాత, కోర్టు ఆమెకు 20000 రూపాయల వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసింది.
ఆమెపై కేసు నమోదు చేసిన తర్వాత ఆమెను అరెస్టు చేసినట్లు అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ నారాయణ్ సింగ్ మీడియాకి తెలిపారు. పోలీసులు ఆమెను కోర్టులో హాజరుపరచగా 20వేల రూపాయల వ్యక్తిగత పూచీకత్తుపై ఆమెకు బెయిల్ మంజూరు చేశారని తెలిపారు. తదుపరి విచారణ జరుగుతోందని పోలీసులు తెలిపారు.
నఫీసా చేసిన పని:
ఉదయపూర్లోని నీర్జా మోడీ స్కూల్ లో పని చేసే నఫీసా అటారీ అనే టీచర్ ను విధుల నుండి తొలగించారు. ఆదివారం ప్రపంచ టీ20 ప్రపంచకప్ మ్యాచ్లో భారత్పై పాక్ విజయం సాధించగానే ఆమె సెలెబ్రేషన్స్ చేసుకోవడంపై స్కూల్ యాజమాన్యం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమెను విధుల నుండి తొలగిస్తున్నామని స్కూల్ యాజమాన్యం తెలిపింది. ఉదయపూర్లోని నీర్జా మోడీ స్కూల్ టీచర్ నఫీసా అటారీ యొక్క వాట్సాప్ పోస్ట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో వైరల్ అయింది. అటారీ తన స్టేటస్ లో “జీత్ గే, మేము గెలిచాము” అనే టెక్స్ట్తో పాక్ ఆటగాళ్ల చిత్రాన్ని పంచుకున్నారు. ఈ పోస్టుపై నఫీసా తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఆమె పాకిస్తాన్కు బహిరంగంగా మద్దతు ఇస్తోందని.. అలాంటి ఆమె తన తరగతిలో విద్యార్థులకు ఏమి బోధిస్తున్నారని నెటిజన్లు ప్రశ్నించారు.
మ్యాచ్ సందర్భంగా తన కుటుంబం రెండు జట్లుగా విడిపోయిందని, ప్రతి జట్టు ఇరువైపులా మద్దతునిచ్చిందని నఫీసా చెప్పారు. ఆమె బృందం పాక్ కు మద్దతు ఇవ్వడం.. ఆ తర్వాత గెలవడంతో తాను మెసేజింగ్ యాప్ వాట్సాప్లో స్టేటస్ను పోస్ట్ చేశానని తెలిపింది. తాను ఈ పని ఏదో తమాషాగా చేశానని వీడియోలో నఫీసా చెప్పుకొచ్చింది.