మునుగోడు ఉప ఎన్నికలకు సంబంధించి తెలుగు దేశం పార్టీ (టీడీపీ) గురువారం కీలక ప్రకటన చేసింది. మునుగోడు ఉప ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లుగా టీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు బక్కని నర్సింహులు గురువారం అధికారికంగా ఓ ప్రకటనను విడుదల చేశారు. మునుగోడు ఉప ఎన్నికలో పోటీ చేయడం కంటే కూడా నియోజకవర్గంలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంపైనే దృష్టి సారించాలని నిర్ణయించినట్లు ఆయన చెప్పుకొచ్చారు. మునుగోడులో టీడీపీ తరఫున పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్న ఆ పార్టీ నేత జక్కలి ఐలయ్య యాదవ్ పేరును పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు గురువారం ప్రకటిస్తారన్న వార్తలు వినిపించాయి. ఆ ప్రకటనకు విరుద్ధంగా ఉప ఎన్నికల్లో పోటీ చేయరాదన్న ప్రకటన వచ్చింది. పార్టీకి చెందిన కీలక నేతలు, మునుగోడుకు చెందిన క్షేత్ర స్థాయి నేతలతో చర్చించిన మీదటే పోటీకి దూరంగా ఉండాలంటూ నిర్ణయం తీసుకున్నామని బక్కని తన ప్రకటనలో వెల్లడించారు. మునుగోడు ఉప ఎన్నికలకు సంబంధించి శుక్రవారంతో నామినేషన్లకు గడువు ముగియనుంది.