తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టుకు ముందు ఆయన ఇంటి వద్ద హైడ్రామా కొనసాగింది. పెద్ద సంఖ్యలో పోలీసులు పట్టాభి ఇంటి వద్దకు వెళ్లారు. ఆయన ఇంటి వద్ద ఉన్న టీడీపీ శ్రేణులను పోలీసులు అక్కడి నుంచి పంపించేశారు. పట్టాభి అరెస్ట్ కు ముందు ఎఫ్ఐఆర్ కాపీ, వారెంట్ చూపించాలని పోలీసులను ఆయన డిమాండ్ చేశారు. అరెస్ట్ సమయంలో ఇంట్లో పట్టాభి, ఆయన భార్య ఉన్నారు. ఈ క్రమంలో ఇంటి తలుపులు బద్దలు కొట్టి పట్టాభిని అరెస్ట్ చేశారు. విజయవాడ గవర్నర్ పేట్ పోలీస్ స్టేషన్ సీఐ పేరిట వారంట్ ఇచ్చారు. ఆయనను గవర్నర్ పేట పీఎస్ కు తరలిస్తున్నట్టు తెలిపారు.
అరెస్టుకు ముందు పట్టాభి ఓ వీడియోను విడుదల చేశారు. తనను అరెస్ట్ చేసేందుకు 200 మంది పోలీసులు ఇంటి వద్దకు చేరుకున్నారని.. తన ఒంటిపై చిన్న గాయం కూడా లేదంటూ శరీర అవయవాలను చూపించారు. పోలీస్ కస్టడీలో తన ఒంటికి చిన్న గీత పడినా ముఖ్యమంత్రి జగన్, డీజీపీ బాధ్యత వహించాలని అన్నారు. గతంలో రఘురామకృష్ణరాజును కస్టడీలో కొట్టారని అందుకే తాను వీడియోను చూపిస్తున్నానని చెప్పారు.
పోలీసులు వ్యవహరించిన తీరుపై పట్టాభి భార్య మండిపడ్డారు. తలుపులు బద్దలుకొట్టి ఇంట్లోకి రావాల్సిన అవసరం ఏముందని మండిపడ్డారు. కనీసం ఎఫ్ఐఆర్ కాపీ కూడా చూపించలేదని.. పోలీసులపై తనకు నమ్మకం లేదని చెప్పారు. పటమట పీఎస్ లో కేసు నమోదయిందని పోలీసులు చెప్పారని ఆమె తెలిపారు. పోలీసులు వచ్చినప్పుడు ఇంట్లో తాను, తన భర్త మాత్రమే ఉన్నామని చెప్పారు. తన భర్తకు ఏం జరిగినా పోలీసులే బాధ్యత వహించాలని అన్నారు.