మదురైలోని విల్లాపురానికి చెందిన 27 ఏళ్ల ఎంఎస్ జగన్ చేసిన పని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకూ ఎందుకంటే.. అతడు తనకు కాబోయే భార్య కోసం పట్టణం మొత్తం పోస్టర్లు వేయడంతో సంచలనంగా మారింది. ఓ ప్రైవేట్ కంపెనీలో మేనేజర్గా పనిచేస్తున్న జగన్ తనకు కాబోయే భార్యను వెతుక్కోవడం కోసం ఈ ప్లాన్ తో ముందుకు వెళ్ళాడు. పోస్టర్లో జగన్ తన నక్షత్రం, కులం, వృత్తి, ఆదాయం, చిరునామా వంటి వివరాలను పేర్కొనడంతో పాటు తనకు భూమి కూడా ఉందని వెల్లడించాడు. డెనిమ్ షర్ట్ ధరించిన ఫోటోను అందులో ఉంచాడు.
స్థానిక న్యూస్ ఛానెల్తో జగన్ మాట్లాడుతూ, మేనేజర్గానే కాకుండా పార్ట్టైమ్ డిజైనర్గా కూడా పనిచేస్తున్నానని తెలిపాడు. డిజైనర్గా పని చేస్తున్నప్పుడే తనకు ఈ ఆలోచన తట్టిందని చెప్పారు. “నేను గత ఐదు సంవత్సరాలుగా వధువు కోసం వెతుకుతున్నాను, కానీ విజయవంతం కాలేదు. నేను చాలా పోస్టర్లను డిజైన్ చేసాను, నా కోసం నేను ఎందుకు డిజైన్ చేయలేను అని అనుకున్నాను, ”అని జగన్ చెప్పాడు. తగిన వధువు దొరికేలా చేస్తామని చెప్పి ఎంతో మంది తన దగ్గర డబ్బులు, జాతకాన్ని తీసుకున్నారని.. కానీ ఎవరు కూడా ఇప్పటి వరకూ తనకు అమ్మాయిని చూపించలేదని వాపోయాడు.
వరుడి కోసం వెతుకుతున్న కుటుంబీకులు తనను సంప్రదిస్తారనే ఆశతో చివరి ప్రయత్నంగా పోస్టర్లు వేశానని జగన్ చెప్పుకొచ్చాడు. “అమ్మాయిల కుటుంబాలకు చెందిన వ్యక్తులు నన్ను సంప్రదిస్తారని నేను అనుకున్నాను, కాని నాకు పెళ్లిళ్ల బ్రోకర్ల నుండి మాత్రమే కాల్స్ వస్తున్నాయి” అని అతను చెప్పాడు. “90లలో జన్మించిన వారికి ఇది చాలా కష్టమైన కాలం అని నేను భావిస్తున్నాను,” అని అతను చెప్పాడు. “నన్ను కూడా ఎగతాళి చేశారు, కానీ నేను పట్టించుకోను… వారు నా పోస్టర్లో మీమ్లు చేస్తున్నారు, కానీ నన్ను అవన్నీ ప్రభావితం చేయలేదు.”అని అతను చెప్పాడు. కాబోయే వధువు కుటుంబం నుండి తనకు పిలుపు వచ్చాక.. అది తన పెళ్లికి దారి తీస్తే “ధన్యవాదాలు” అంటూ పోస్టర్ను కూడా ఉంచాలని భావిస్తున్నట్లు జగన్ చెప్పుకొచ్చాడు.