ఆఫ్ఘనిస్తాన్ ను తాలిబాన్లు స్వాధీనం చేసుకున్న తర్వాత తమ దగ్గర ఉన్న ఆయుధాలను ప్రపంచ దేశాలకు చూపించాలని తాలిబాన్లు భావించారు. అందులో భాగంగా తమ దగ్గర ఉన్న ఆయుధాలతో పెరేడ్ ను నిర్వహించారు. అంతేకాకుండా ఆ దేశ మీడియాలో లైవ్ టెలికాస్ట్ చేయించారు. ఆఫ్ఘనిస్తాన్ను స్వాధీనం చేసుకున్న రెండు వారాల తరువాత తాలిబాన్లు తమ సైనిక సామర్థ్యాలను ప్రపంచానికి తెలియజేయాలని అనుకుంటూ ఉంది. తాలిబాన్ల ఆధ్యాత్మిక కేంద్రమైన కాందహార్ వీధుల్లో “విక్టరీ ల్యాప్” సమయంలో బ్లాక్హాక్ హెలికాప్టర్లను కవాతు చేసిన తరువాత, తాలిబాన్ ఇప్పుడు తన సైనిక శక్తిని ప్రదర్శిస్తూ మరొక కవాతును నిర్వహించింది.
అమెరికా మద్దతుగల ఆఫ్ఘన్ జాతీయ ప్రభుత్వం పతనం తరువాత తాలిబాన్లు దోచుకున్న ఆయుధాలను బుధవారం నాడు విజయోత్సవ కవాతులో ప్రదర్శించారు. కవాతులో తాలిబాన్లు తమ ఆత్మాహుతి దాడులు, కారు బాంబులు, బారెల్ బాంబులు, పేలుడు పదార్థాలు మొదలైనవి ప్రదర్శించారు. ఆఫ్ఘనిస్తాన్ యొక్క పబ్లిక్ బ్రాడ్కాస్టర్ అయిన రేడియో టెలివిజన్ ఆఫ్ఘనిస్తాన్ (RTA) లో ఈ కార్యక్రమం ప్రసారం చేయబడింది. ఇస్లామిక్ ఎమిరేట్ జెండాను మోసుకుంటూ ఓ బృందం కవాతు చేయడం కనిపించింది.
ఈ కార్యక్రమంలో తాలిబన్లు తేలికపాటి ఆయుధాలు, భారీ ఆయుధాలు, మైన్స్, ఎల్లో బారెల్స్, కారు బాంబులను ప్రదర్శించారు. దేశ స్వాతంత్ర్యం, దేశ రక్షణకు వ్యతిరేకంగా ఉన్న ఆక్రమణదారులు మరియు వారి తొత్తులపై ఈ ఆయుధాలు ఉపయోగించబడుతాయని తాలిబాన్ వ్యాఖ్యాత చెప్పారు. ఈ ఆయుధాలలో అత్యంత ప్రాముఖ్యమైనవి ఎల్లో బారెల్, వెస్ట్ బాంబు మరియు కార్ బాంబులు అని తాలిబాన్లు చెప్పారు. శత్రువుల వాహనాలను నాశనం చేయగల ముజాహిదీన్ సైనిక పరిశ్రమలో ఎల్లో బాంబులు గొప్ప ఆవిష్కరణ అని అన్నారు. తాలిబాన్లు సూసైడ్ బాంబులను కూడా ప్రదర్శించారు. దీనిని వారు శత్రువులకు చెందిన లక్ష్యాలను నాశనం చేయడానికి ఉపయోగిస్తారని తెలిపారు. ఇరానియన్ జర్నలిస్ట్ తాజుడెన్ సోరౌష్ పంచుకున్న మరో వీడియోలో, తాలిబాన్ యోధులు తమ కరాటే నైపుణ్యాలను ప్రదర్శించారు.
తాలిబాన్లు ప్రదర్శిస్తున్న ఆయుధాలు వారికి చెందినవి కావు అని ప్రపంచం మొత్తానికి తెలుసు. తాలిబాన్ల చేతుల్లోకి వెళ్లిన చాలా ఆయుధాలు గతంలో ఆఫ్ఘన్ జాతీయ దళాల నుండి తాలిబాన్ యోధులు దోచుకున్నారు. ఆఫ్ఘన్ జాతీయ దళాలు తాలిబాన్లకు వ్యతిరేకంగా చేసిన యుద్ధంలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని అందించింది. యుఎస్ దళాలు ఆఫ్ఘనిస్తాన్ నుండి వైదొలిగిన తరువాత మరియు ఆఫ్ఘన్ దళాలు తాలిబాన్లకు లొంగిపోయాయి. తాలిబాన్లు దేశాన్ని స్వాధీనం చేసుకున్న తరువాత, ఈ ఆయుధాలు తాలిబాన్లకు అప్పగించబడ్డాయి. స్థానిక ఆయుధాలతో పాటు, ఆఫ్ఘనిస్తాన్ లో అమెరికా దళాలు విడిచిపెట్టిన అధునాతన అమెరికన్ ఆయుధాలు మరియు వాహనాలు తాలిబాన్ చేతుల్లోకి వెళ్ళింది.
ఆగష్టు 31, 2021 న అధికారికంగా ఆఫ్ఘనిస్తాన్ నుండి బయలుదేరిన US నేతృత్వంలోని దళాలు దాదాపు 80 బిలియన్ డాలర్ల విలువైన సైనిక పరికరాలను వదిలిపెట్టాయి. అమెరికా 2003 నుండి ఆఫ్ఘన్ దళాలకు 16,000 కంటే ఎక్కువ నైట్-విజన్ గాగుల్ పరికరాలు, 600,000 పదాతిదళ ఆయుధాలు, M16 అస్సాల్ట్ రైఫిల్స్ మరియు 162,000 కమ్యూనికేషన్ పరికరాలను అందించింది. అంతేకాకుండా, రైఫిల్స్, మెషిన్ గన్స్, పిస్టల్స్, గ్రెనేడ్ లాంచర్లు మరియు RPG ల వంటి 6 లక్షలకు పైగా చిన్న ఆయుధాలు తాలిబాన్ యోధుల చేతిలో పడ్డాయి. తాలిబాన్లు నిఘా పరికరాలు, రేడియో వ్యవస్థలు, డ్రోన్లు మొదలైన వాటిని భద్రపరిచారు. ఈ ఆయుధాలను తాలిబాన్లు దేని కోసం ఉపయోగిస్తారోనని ప్రపంచం మొత్తం ఆందోళన వ్యక్తం చేస్తోంది.