టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ ను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ అధికారికంగా ప్రకటించింది. రౌండ్-2 లో భాగంగా అక్టోబర్ 23న మ్యాచ్ ఆస్ట్రేలియా-సౌత్ ఆఫ్రికా మధ్య అబుదాబీ వేదికగా మొదటి మ్యాచ్ మొదలు కానుంది. ఇక క్రికెట్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే భారత్-పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అక్టోబర్ 24న దుబాయ్ వేదికగా జరగనుంది. సూపర్ 12లో గ్రూప్ 2లో ఉన్న భారత్.. అక్టోబర్ 24న పాకిస్తాన్తో, అక్టోబర్ 31న న్యూజిలాండ్తో, నవంబర్ 3న ఆఫ్ఘనిస్తాన్ తో, నవంబర్ 5న బి1 క్వాలిఫయర్తో, నవంబర్ 8న ఏ1 క్వాలిఫయర్తో మ్యాచ్లు ఆడనుంది. నవంబర్ 10,11 తేదీల్లో సెమీ ఫైనల్స్, నవంబర్ 14వ తేదీన ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
రౌండ్ 1 గ్రూప్ బీలో ఆతిథ్య ఒమన్, పపువా న్యూగినియాల మధ్య మ్యాచ్తో అక్టోబర్ 17న మెగా ఈవెంట్ ప్రారంభం కానుంది. రౌండ్ 1లో భాగంగా గ్రూప్ ఏ లో శ్రీలంక, ఐర్లాండ్, నెదర్లాండ్స్, నబీబియా జట్లు ఉన్నాయి. గ్రూప్ బి లో బంగ్లాదేశ్, స్కాట్లాండ్, పపువా న్యూగినియా, ఒమన్ జట్లు ఉన్నాయి. క్వాలిఫయర్స్ మ్యాచ్ల అనంతరం ఒక్కో గ్రూప్ నుంచి టాప్ లో నిలిచిన రెండేసి జట్లు టీ20 వరల్డ్ కప్ రౌండ్-2కు క్వాలిఫై అవుతాయి.
భారత్ లో గతేడాది జరగాల్సిన ఈ టోర్నమెంట్ కరోనా కారణంగా వాయిదా పడింది. యూఏఈ, ఒమన్ వేదికగా ఈ ఏడాది అక్టోబర్ 17వ తేదీ నుంచి నవంబర్ 14వరకు టీ20 ప్రపంచకప్ జరగనుంది. ఫైనల్ వేదికగా దుబాయ్ని నిర్ణయించారు.
ఐసిసి టీ20 ప్రపంచ కప్ 2021లో పాల్గొనే క్రికెట్ జట్లకు తమ ఆటగాళ్ళ జాబితాని సెప్టెంబర్ 10 లోపు పంపాలని ఐసీసీ మేనేజ్మెంట్ సూచించింది. వరల్డ్ కప్ కోసం కేవలం 15 మంది ఆటగాళ్ళతో పాటు 8 మంది సహాయకుల జాబితా మాత్రమే పంపాలని సూచించింది. కరోనాని దృష్టిలో పెట్టుకొని అత్యవసర పరిస్థితుల్లో అదనపు ఆటగాళ్ళను తీసుకొని రావొచ్చని కాకపోతే 15 మంది ఆటగాళ్ళు, 8 మంది సహాయ సిబ్బంది ఖర్చులు మినహా అదనపు ఆటగాళ్ళ పూర్తి ఖర్చులు ఆ టీం యాజమాన్యమే భరించాలని ఐసీసీ తెలిపింది.