తెలంగాణలోని హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలో ప్రేమ పేరుతో వేధింపులు భరించలేని ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం మండలంలోని గట్లనర్సింగాపూర్కు చెందిన నమిండ్ల శ్వేత (18) కరీంనగర్లో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. అదే గ్రామానికి చెందిన మీసాల వంశీ ప్రేమిస్తున్నానంటూ ఏడాది కాలంగా ఆమె వెంట పడుతూ వేధిస్తున్నాడు. శుక్రవారం సాయంత్రం స్నేహితుడు జగదీశ్తో కలిసి శ్వేత ఇంటికి వచ్చిన వంశీ ఆమెతో గొడవపడ్డాడు. అదే సమయంలో ఆమె తండ్రి రావడంతో భయపడి పారిపోతూ తనను ప్రేమించకుంటే ఎప్పటికైనా చంపేస్తానని, పరువు తీస్తానని బెదిరించాడు. అవమానం భరించలేని శ్వేత గ్రామ శివారులోని బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
వంశీ బెదిరింపులను భరించలేక తన కూతురు ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తండ్రి చంద్రమౌళి ఆరోపించారు. అతడిచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ప్రవీణ్కుమార్ తెలిపారు.