More

    సురేంద్ర పురి కుందా సత్యనారాయణ ఇక లేరు

    తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట సమీపంలో ఉన్న సురేంద్రపురిని నిర్మించిన ప్రముఖ పారిశ్రామికవేత్త కుందా సత్యనారాయణ తుదిశ్వాస విడిచారు. అనారోగ్యం బారిన పడి మృతి చెందిన తన చిన్న కుమారుడు సురేందర్ జ్ఞాపకార్థం ఆయన సురేంద్రపురిని నిర్మించారు. సురేంద్రపురి కుందా సత్యనారాయణ కళాధామం సృష్టికర్త, ప్రముఖ పారిశ్రామికవేత్త కుందా సత్యనారాయణ గత మూడు నెలలుగా అనారోగ్యంతో బాధపడుతూ బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంటకు జూబ్లీహిల్స్‌ మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

    అనారోగ్యం బారినపడి మృతిచెందిన తన చిన్న కుమారుడు సురేందర్‌ జ్ఞాపకార్థంగా యాదగిరిగుట్ట సమీపంలో భువనగిరి మండలం వడాయిగూడెం దగ్గర సత్యనారాయణ సురేంద్రపురి పేరుతో హిందూధర్మ శిల్పకళాప్రదర్శన ఆలయాన్ని అభివృద్ధి చేశారు. శిల్పకళకు పెద్దపీట వేస్తూ ఈ దేవాలయం నిర్మించారు. ఆంజనేయ స్వామి, శివుడు, నాగదేవత భారీ విగ్రహాలతో పాటు మహాభారతం, రామాయణం వంటి ఇతిహాసాలకు దృశ్య రూపమిచ్చి కళాధామాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దారు. పంచముఖ ఆంజనేయుడు, శివుడు, వేంకటేశ్వరస్వామి ఆలయాలను నిర్మించారు. అందరు దేవుళ్ల విగ్రహాలు ఉన్నాయి. 2009 ఫిబ్రవరి 8న దీన్ని ప్రారంభించారు. హైదరాబాదుకు సమీపంలో ఉండటంతో సురేంద్రపురికి పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉండేది. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా నవ గ్రహాలకు సతీ సమేతంగా, వాహన సమేతంగా, ఆది దేవత, ప్రత్యధి దేవతల సమేతంగా విడివిడిగా తొమ్మిది ఆలయాలు నిర్మించడం సురేంద్రపురిలో ప్రత్యేకత. పుట్టమన్నుతో చేసిన శివలింగాలకు అర్చన చేస్తే గ్రహదోశాలు తొలగుతాయని భక్తుల నమ్మకం. అందుకోసం చాలా ప్రాంతాల నుండి భక్తులు వచ్చి పూజలు చేస్తూ ఉంటారు.

    గత 3 నెలలుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన నిన్న తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య హైమావతి, కుమారులు శ్రీనివాస్, ప్రతాప్, కుమార్తె సూర్యకుమారి ఉన్నారు. 1938 జూన్ 15వ తేదీన ఆయన జన్మించారు. ఆయన మరణం పట్ల పలువురు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

    Trending Stories

    Related Stories