More

    బీబీసీ డాక్యుమెంటరీ వివాదంపై దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు విచారణ

    ది మోడీ క్వశ్చన్ అనే పేరుతో 2002 గుజరాత్ అల్లర్లపై బీబీసీ ఇటీవల రూపొందించిన డాక్యుమెంట్ దేశ వ్యాప్తంగా సంచలనాన్ని సృష్టించింది. ఇది వివాదాస్పదమైనవిగా భావించిన కేంద్ర ప్రభుత్వం.. ఆ లింక్ లను వెంటనే తొలగించాలని జనవరి 21న ఆయా సామాజిక మాధ్యమాలను ఆదేశించింది. ఈ డాక్యుమెంటరీ తప్పుదారి పట్టించే విధంగానూ, కుట్రపూరితంగానూ ఉందని, రాజ్యాంగ విరుద్దమని కేంద్రం పేర్కొంది. కేంద్రం తీసుకున్న చర్య మీడియా స్వేచ్చకు, సమాచారం తెలుసుకునేందుకు ప్రజలకు ఉన్న హక్కును కాలరాయడమేనని విమర్శలు కూడా వచ్చాయి.

    ఇక బీబీసీ డాక్యుమెంటరీ వివాదంపై దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు విచారణ జరిపింది. ఆ డాక్యుమెంటరీని బ్యాన్ చేస్తూ తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన ఒరిజినల్ రికార్డులను సమర్పించాలని కేంద్రానికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. మూడు వారాల్లో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రానికి సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చింది. బీబీసీ డాక్యుమెంటరీని చూసే పౌరులను ప్రభుత్వం అరెస్టు చేస్తొందనీ, దీనిపై బ్యాన్ విధించడం భావ ప్రకటనా స్వేచ్చ కు విరుద్దమేనని పేర్కొంటూ సీనియర్ జర్నలిస్ట్ రామ్, టీఎంసీ ఎంపీ మహువా మెయిత్రా, సామాజిక కార్యకర్త, న్యాయవాది ప్రశాంత్ భూషణ్, మరో న్యాయవాది ఎంఎల్ శర్మ దాఖలు చేసిన పిటిషన్ల పై జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎంఎం సుందరేష్ తో కూడిన సుప్రీం ధర్మాసనం విచారణ జరిపింది. కేంద్ర ప్రభుత్వంతో పాటు మరి కొందరికీ నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఏప్రిల్ కు వాయిదా వేసింది. కేంద్రం నిషేదం తర్వాత కూడా కేరళతో పాటు ఢిల్లీ యూనివర్శిటీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ వంటి కొన్ని చోట్ల ఈ డాక్యుమెంటరీని ప్రదర్శించారు. కొన్ని పార్టీలు ఈ డాక్యుమెంటరీని మోదీ ప్రభుత్వంపై అక్కసు వెళ్లగక్కేందుకు కూడా ఉపయోగిస్తూ ఉన్నాయి.

    Trending Stories

    Related Stories