ఏపీలో పరీక్షల నిర్వహణ వల్ల చనిపోతే కోటి రూపాయల నష్ట పరిహారం ఇవ్వాలి: సుప్రీం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పది, ఇంటర్ పరీక్షలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఇందుకు విపక్షాలు మాత్రం ఒప్పుకోలేదు. ఇప్పుడే సెకండ్ వేవ్ ముగిసింది.. థర్డ్ వేవ్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తూ వస్తున్నారు. దీంతో రాష్ట్రంలో పదో తరగతి, ఇంటర్ పరీక్షల నిర్వహణల అంశం సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది.
పరీక్షల విషయమై ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ అఫిడవిట్ పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు హెచ్చరికలు జారీ చేసింది. సమాచారం పక్కాగా ఉండాలని చెప్పినా కూడా అఫిడవిట్ లో ఆ సమాచారం కనిపించలేదని అసహనం వ్యక్తం చేసింది. విద్యార్థులు, సిబ్బంది రక్షణ గురించి ప్రభుత్వం ఆలోచించాలని.. పరీక్షల నిర్వహణ వల్ల ఏ ఒక్కరు చనిపోయినా కోటి రూపాయల నష్ట పరిహారం ఇవ్వాల్సి ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది. కరోనా సమయంలో ఒక్కో గదిలో 15 నుంచి 20 మందిని కూర్చో బెట్టడం ఎలా సాధ్యమవుతుందని సుప్రీం ప్రశ్నించింది.
ప్రభుత్వం చెపుతున్నదాన్ని బట్టి పరీక్షలకు 28 వేల గదులు అవసరమవుతాయని అన్ని వేల గదులను అందుబాటులోకి ఎలా తీసుకురాగలరని ప్రశ్నించింది. పరీక్షల తర్వాత జరిగే మూల్యాంకనం ప్రక్రియ కూడా చాలా పెద్దగా ఉంటుందని వీటన్నిటికి సంబంధించి అఫిడవిట్ లో ఎలాంటి వివరాలు లేవని ధర్మాసం తెలిపింది. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఒక నిర్ణయాత్మక ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంటుందని సూచించింది. గ్రేడ్లను మార్కులుగా మార్చడం కష్టమే అయినప్పటికీ పరిస్థితులకు అనుగుణంగా ముందుకు వెళ్లాల్సి ఉంటుందని.. అవసరమైతే యూజీసీ, సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ బోర్డుల సలహాలను తీసుకోవాలని సూచించింది. ఇక ఏపీ ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ.. కొంత సమయం ఇస్తే, ప్రభుత్వ నిర్ణయాన్ని వెల్లడిస్తామని కోర్టును కోరారు. ఇందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఇప్పటికిప్పుడే నిర్ణయం తీసుకోవాలని చెప్పింది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.