ఉక్రెయిన్ నుండి పలు దేశాల విద్యార్థులు బయట పడడానికి కష్టాలు పడుతూ ఉన్నారు. భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ గంగ కొనసాగుతోంది. ఉక్రెయిన్లోని భారతీయులతో ఆరు విమానాలు ఢిల్లీకి చేరుకున్నాయి. సోమవారం సాయంత్రం ఢిల్లీ చేరుకున్న విమానంలో 240 మంది భారతీయులు దేశం చేరుకోగా.. ఇప్పటిదాకా ఉక్రెయిన్ నుంచి సురక్షితంగా భారత్ చేరుకున్న వారి సంఖ్య 1,396కు చేరుకుంది. కేంద్ర మంత్రివర్గంలోని నలుగురు మంత్రులు ఉక్రెయిన్ సరిహద్దు దేశాలకు చేరుకుంటున్నారు.
పాకిస్తాన్ విద్యార్థులు కూడా పెద్ద ఎత్తున ఉక్రెయిన్ లో ఉన్నారు. ఇమ్రాన్ఖాన్ ప్రభుత్వం పాకిస్తానీ విద్యార్థులను పట్టించుకోవడం లేదంటూ తీవ్ర విమర్శలు వస్తున్నాయి. సంక్షోభం నుంచి తప్పించుకోవడానికి పాక్ విద్యార్థులు భారత జెండాను ఉపయోగిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్న వీడియో వైరల్గా మారింది. తమ వాహనంపై తమ జాతీయ జెండాను ప్రదర్శిస్తే భారతీయులకు ఎటువంటి హాని జరగదని రష్యన్లు హామీ ఇవ్వడంతో పాక్ విద్యార్థులు ఈ పని చేస్తున్నారు. ట్విట్టర్లో విస్తృతంగా ప్రసారం అవుతోంది ఈ వీడియో. పాకిస్తానీ విద్యార్థులు భారత జెండాను ఉపయోగిస్తున్నారని పాకిస్తానీ న్యూస్ యాంకర్ చెప్పారు.
పాక్ కు సంబంధించిన వార్తలను ఎక్కువగా నివేదించే ‘హిందుస్థాన్ స్పెషల్’ అనే యూట్యూబ్ ఛానెల్ కూడా ఫిబ్రవరి 27న ఒక వీడియోను షేర్ చేసింది. ఇందులో ఉక్రెయిన్లోని పాకిస్తానీ విద్యార్థులు భారత జెండాను పట్టుకున్నారని వెల్లడించాడు. మరో దేశంలోకి వెళ్లేందుకు, ఉక్రెయిన్ సరిహద్దుకు సురక్షితంగా చేరుకోడానికి ‘భారత్ మాతా కీ జై’ నినాదాలు చేశారు.
పాకిస్తాన్ ప్రభుత్వం తన విద్యార్థులను ఏ మాత్రం పట్టించుకోకపోగా, భారత ప్రధాని నరేంద్ర మోదీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో మాట్లాడారు. ఉక్రెయిన్ నుండి భారతీయులను సురక్షితంగా తరలించడానికి అనుమతిస్తామని పుతిన్ హామీ ఇచ్చారు. ఉక్రెయిన్తో సరిహద్దులో ఉన్న దేశాల అధిపతులతో కూడా ప్రధాని మోదీ మాట్లాడారు. ఎటువంటి సమస్య లేకుండా భారతీయుల ప్రవేశానికి అనుమతిస్తామని ఆయా దేశాలు హామీ ఇచ్చాయి. ఉక్రెయిన్లో చిక్కుకున్న భారతీయ విద్యార్థులు భద్రత కోసం తమ వాహనాలపై జాతీయ జెండాను తీసుకెళ్లాలని భారత ప్రభుత్వం సూచించింది.
ఉక్రెయిన్లో చిక్కుకున్న తమ దేశ విద్యార్థులను బయటకు తీసుకుని రావడానికి పాకిస్తాన్ ప్రభుత్వం పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన విద్యార్థులకు పరిస్థితి మెరుగుపడిన తర్వాత తరలిస్తామని చెబుతోంది. నిస్సహాయ పాకిస్తానీ విద్యార్థులు వాహనాలను అద్దెకు తీసుకోవడం, వాహనాలపై భారత జెండాలను అతికించడం మాత్రమే కాకుండా ‘భారత్ మాతా కీ జై’ నినాదాలు చేస్తున్నారు. భారతీయుల లాగా నటిస్తూ అక్కడి నుండి సురక్షితంగా బోర్డర్ ప్రాంతాలకు చేరుకోవాలని చూస్తున్నారు. ఉక్రెయిన్లోని మెట్రో సబ్వేలలో చిక్కుకున్న పాకిస్తానీ విద్యార్థుల ఖాతాలను కూడా హిందుస్థాన్ స్పెషల్ షేర్ చేసింది. పాకిస్తాన్ రాయబార కార్యాలయం నుండి ఎవరూ తమను రక్షించడానికి రాకపోవడంతో ఆహారం, నీరు లేకుండా అక్కడ చిక్కుకుపోయామని చెబుతున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఒక పాక్ విద్యార్థి వారి దేశ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ “విద్యార్థులందరినీ ఖాళీ చేయించినట్లు రాయబార కార్యాలయం అబద్ధం చెబుతోంది. కానీ మేమంతా ఇక్కడే కూర్చున్నాం. అన్ని దేశాలు తమ ప్రజలను ఖాళీ చేయిస్తున్నాయి, కానీ పాకిస్తాన్ పట్టించుకోవడం లేదు” అని తెలిపాడు. “మేము పాకిస్తానీయులం కావడమే మా తప్పు” అని మరొక పాకిస్తానీ విద్యార్థి ఏడుస్తూ చెప్పుకొచ్చాడు.
భారతీయ విద్యార్థి తమ వాహనంపై భారత్ జెండా ఉండడం వలన ఎలా బయటపడ్డామో వివరించాడు. “భారత జెండాను చూసి సైనికులు, సైనిక సిబ్బంది ఎంతో గౌరవం ఇస్తున్నారు. ఎలాంటి తనిఖీలు చేయకుండా మమ్మల్ని వదిలిపెట్టారు. భారతదేశం ప్రపంచవ్యాప్తంగా తనకంటూ ఒక పేరును నిర్మించుకుంది. నేను భారతీయుడిగా ఉన్నందుకు గర్విస్తున్నాను” అని విద్యార్థి చెప్పాడు.