స్పెస్జెట్ విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. 5వేల అడుగుల ఎత్తులో విమానం ప్రయాణిస్తుండగా.. క్యాబిన్లో ఒక్కసారిగా పొగలు వెలువడ్డాయి. ఫలితంగా జబల్పూర్కు వెళ్లాల్సిన ఆ విమానాన్ని తిరిగి ఢిల్లీకి తీసుకెళ్లారు.
విమానంలో పొగల కారణంగా.. జబల్పూర్ వెళ్లాల్సిన స్పైస్జెట్ విమానం.. శనివారం ఉదయం ఢిల్లీకి తిరిగివచ్చేసింది. 5వేల అడుగుల ఎత్తులో ఉన్నప్పుడు విమాన క్యాబిన్లో పొగలను గుర్తించిన సిబ్బంది.. అప్రమత్తమై విమానాన్ని ఢిల్లీకి తీసుకొచ్చేశారు. “ఢిల్లీ నుంచి జబల్పూర్కు స్పైస్జెట్ విమానం వెళ్లాల్సి వచ్చింది. కానీ 5వేల అడుగుల ఎత్తులో ఉన్నప్పుడు క్యాబిన్లో పొగలు వచ్చాయి. దానిని గుర్తించిన సిబ్బంది, విమానాన్ని ఢిల్లీకి తీసుకొచ్చేశారు. ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు,” అని స్పైస్జెట్ ప్రతినిధి ఒకరు మీడియాకు వివరించారు.
కాగా.. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. విమానంలో పొగలు అలుముకోవడం, వాటి మధ్య ప్రయాణికులు ఉండటం వీడియోలో కనిపిస్తోంది. ఓ స్పైస్జెట్ విమానం.. అత్యవసరంగా ల్యాండింగ్ జరగడం.. గత 15రోజుల్లో ఇది రెండోసారి. జూన్ 19న.. ఢిల్లీకి వెళ్లాల్సిన స్పైస్జెట్ విమానాన్ని గాలిలో ఓ పక్షి ఢీకొట్టింది. ఫలితంగా ఎడమ ఇంజిన్లో మంటలు చెలరేగాయి. విమానాన్ని పట్నాలో అత్యవసరంగా దింపాల్సి వచ్చింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హాని జరగలేదు.