నైరుతి రుతుపవనాలు వచ్చేశాయి. నైరుతి రుతుపవనాలు నేడు కేరళను తాకాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఓ ప్రకటన చేసింది. బంగాళాఖాతంలో అసని తుపాను సంభవించగా, ఈ నెల 27నే రుతుపవనాలు కేరళ చేరుకుంటాయని అంచనా వేసినా, రెండ్రోజుల ఆలస్యం అయింది. భారతదేశంలో అత్యధిక వర్షపాతం ఈ నైరుతి రుతుపవనాల వల్లే కలుగుతుంది. దేశ వ్యవసాయ రంగం కూడా ఈ రుతుపవనాలపైనే అత్యధికంగా ఆధారపడుతోంది. ‘నైరుతి’ ప్రభావంతో కేరళలోని అనేక ప్రాంతాల్లోనూ, లక్షద్వీప్ ప్రాంతంలోనూ గణనీయమైన స్థాయిలో వర్షపాతం నమోదైంది. వచ్చే వారం రోజుల వరకు నైరుతి రుతుపవనాలు తమిళనాడు, కర్ణాటక, ఏపీ, తెలంగాణ వరకు విస్తరించే అవకాశాలు లేవని, ఆయా రాష్ట్రాల్లో ‘నైరుతి’ ప్రభావం కనిపించడానికి కొంత సమయం పడుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ‘నైరుతి’ ఆగమనంతో దేశ ప్రజలకు ఎండల నుంచి ఉపశమనం కలగనుంది.