టీ20 ప్రపంచ కప్ లో భాగంగా భారత్, పాక్ మధ్య శనివారం మ్యాచ్ జరగనుంది. క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తూ ఉన్నారు. ఈ మ్యాచ్ కు ముందు పలువురు మాజీ క్రికెటర్లు తమ అభిప్రాయాలను పంచుకుంటూ ఉన్నారు. టీమిండియా మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ.. ఇరు దేశాల క్రికెట్ టీమ్ల మధ్య గతంలోనూ పలుసార్లు ప్రపంచకప్లో భాగంగా తొలి మ్యాచ్లు జరిగాయని.. 2017లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలోనూ పాక్తోనే భారత్ తొలి మ్యాచ్ ఆడిందని, ఆ ట్రోఫీలో ఫైనల్లోనూ ఇరు జట్లు తలబడ్డాయని అన్నారు. ఇరు దేశాలు తమ తొలి మ్యాచ్లు ఆడే విషయంలో ఈ సంప్రదాయం ఇకపై కూడా కొనసాగుతుందని చెప్పారు.
భారత్-పాక్ తలబడుతున్నాయంటే ప్రతి ఒక్కరికీ ఆసక్తి ఉంటుందని.. పాక్ తో మ్యాచ్ ఆడుతున్నామంటే భారత జట్టుకు కాస్త ఒత్తిడి ఉంటుందని కొందరు భావిస్తారని గంగూలీ అన్నారు. తాను మాత్రం అలా అనుకోవడం లేదని.. తాను గతంలో బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ కు తొలిసారి అధ్యక్షుడిని అయ్యాక 2016లో టీ20 ప్రపంచకప్ మ్యాచ్లో ఇరు దేశాల జట్ల మధ్య మ్యాచ్ను ఈడెన్ గార్డులోనే నిర్వహించామని గంగూలీ గుర్తు చేశారు. ఆ సమయంలోనూ భారత్ ఎటువంటి ఒత్తిడికీ గురి కాలేదని అన్నారు. ఇరు దేశాల మధ్య మ్యాచ్లను ఇప్పుడు భారత్ లో నిర్వహించడం కష్టమని చెప్పారు. ఇరు దేశాల మ్యాచ్ల టికెట్లకు భారీగా డిమాండ్ ఉందని, ప్రస్తుతం పరిస్థితుల్లో దుబాయ్లోనే మ్యాచులు నిర్వహించడం సరైందని తెలిపారు. పాక్పై భారత్ కు మంచి రికార్డు ఉందని తెలిపారు. పాక్ అప్పట్లో చాలా బలంగా ఉండేదని.. కానీ ఇప్పుడు టీమిండియా మునుపటి కన్నా బలమైన జట్టుగా ఉందని గంగూలీ చెప్పుకొచ్చారు. భారత జట్టులో సమర్థమైన కొత్త క్రికెటర్లు వస్తున్నారని అన్నారు దాదా.
జట్టును ప్రకటించిన పాక్:
మ్యాచ్కు ఓ రోజు సమయం ఉండగానే.. పాక్ జట్టు 12 మందితో కూడిన జట్టును ప్రకటించింది. బాబర్ ఆజామ్ (కెప్టెన్), అసిఫ్ అలీ, ఫకార్ జమాన్, హైదర్ అలీ, మహ్మద్ రిజ్వాన్, ఇమాద్ వసీమ్, మహ్మద్ హఫీజ్, షాదాబ్ ఖాన్, షోయబ్ మాలిక్, హరీస్ రౌఫ్, హసన్ అలీ, షహీన్ షా అఫ్రిదీ 12 మందిలో ఉన్నారు. దుబాయ్ వేదికగా భారత కాలమానం ప్రకారం రాత్రి 7.30గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.